చిరు- బాలయ్య- నాగ్.. ఒక్క ఏడాదిలోనే మూడు ఇండస్ట్రీ హిట్స్ !!
తెలుగు చిత్ర పరిశ్రమలో 'నాలుగు స్తంభాలు'గా పిలవబడే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున దశాబ్దాలుగా టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన అద్భుతమైన డాన్సులు, ఫైట్లు.. మాస్ ఇమేజ్తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి మెగాస్టార్ గా ఎదిగారు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ తన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, పౌరాణిక పాత్రలు.. హై-వోల్టేజ్ యాక్షన్ సినిమాలతో మాస్ ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు అగ్ర హీరోలు పోటీ పడుతూనే తెలుగు సినిమా స్థాయిని కమర్షియల్గా పెంచడంలో కీలక పాత్ర పోషించారు.
మరోవైపు విక్టరీ వెంకటేష్ కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మారి, మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య దైవమయ్యారు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన, నేటికీ మల్టీస్టారర్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇక అక్కినేని నాగార్జున టాలీవుడ్ 'మన్మథుడు'గా గుర్తింపు పొందడమే కాకుండా, ప్రయోగాత్మక చిత్రాలకు పెద్దపీట వేశారు. కొత్త దర్శకులను ప్రోత్సహించడంలోనూ, టెక్నికల్ వాల్యూస్ను పెంచడంలోనూ ఆయన ఎప్పుడూ ముందుంటారు. అయితే ఒకే ఏడాదిలో ముగ్గురు అగ్రహీరోలు వరుసగా ఇండస్ట్రీ హిట్స్ ఇవ్వడం అనేది అరుదైన ఘనత.

కాగా తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సంవత్సరాలు ప్రత్యేక మైలురాళ్లుగా నిలిచిపోతాయి. అందులో 1989 సంవత్సరం ఒక గొప్ప చాప్టర్గా గుర్తింపు పొందింది. ఆ సంవత్సరాన్ని గ్రాండ్గా ప్రారంభించింది మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి కానుకగా వచ్చిన "అత్తకు యముడు అమ్మాయికి మొగుడు" సినిమా భారీ విజయాన్ని సాధించింది. దర్శకుడు కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో వాణిశ్రీ, విజయశాంతి కీలక పాత్రలు పోషించారు. చిరంజీవి కామెడీ టైమింగ్, స్టెప్పులు, మాస్ అట్రాక్షన్ కలిసి సినిమాను బాక్సాఫీస్ సెన్సేషన్గా మార్చాయి.
ఇక అదే ఊపులో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగారు. ఏప్రిల్లో విడుదలైన "ముద్దుల మావయ్య" చిత్రం ఫ్యామిలీ ఎమోషన్స్తో ప్రేక్షకులను కట్టిపడేసింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కూడా విజయశాంతి హీరోయిన్గా నటించడం విశేషం. ఈ సినిమా భారీ వసూళ్లతో పాటు, మరిన్ని కేంద్రాల్లో 100 రోజుల ప్రదర్శనతో కొత్త రికార్డులు సృష్టించింది. చిరంజీవి సినిమా సెట్ చేసిన రికార్డులను అధిగమిస్తూ, ఈ చిత్రం మరో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.
అయితే ఈ పోటీకి క్లైమాక్స్ ఇచ్చింది మాత్రం కింగ్ నాగార్జున నటించిన శివ చిత్రం. అక్టోబర్లో విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా ట్రెండ్ను పూర్తిగా మార్చేసింది. దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ పరిచయమైన ఈ చిత్రంతో కొత్త టెక్నికల్ స్టాండర్డ్స్ స్థాపించబడ్డాయి. రియలిస్టిక్ మేకింగ్, న్యూ ఏజ్ స్క్రీన్ప్లే, క్యాంపస్ బ్యాక్డ్రాప్ కలిసి 'శివ'ను ట్రెండ్ సెట్టర్గా నిలిపాయి. అమల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం వసూళ్ల పరంగా కూడా ముందున్న రికార్డులను చెరిపేసి, ఆ సంవత్సరానికి అతిపెద్ద ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.












Click it and Unblock the Notifications