ఓటీటీలోకి విజయ్ 'జన నాయగన్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!
దళపతి విజయ్ చివరి సినిమా "జన నాయగన్" ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఎన్నోసార్లు వాయిదా పడిన తర్వాత ఈ మూవీ జూలై 23 న థియేటర్లలో విడుదలైంది. విజయ్ చివరి సినిమా కావడంతో రిలీజ్ కు ముందే థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. రిలీజ్ రోజు భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత సినిమాకు ప్లాఫ్ టాక్ రావడంతో వసూల్లు తగ్గాయి. కానీ విజయ్ చరిష్మాతో తమిళనాడులో ఈ మూవీ ఎలాగోలా నెట్టుకొస్తోంది. అయితే థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది.
విజయ్ జన నాయగన్ మూవీ 2026, సెప్టెంబర్ 21న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 లో స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు స్పష్టం అవుతోంది. అయితే హిందీ ప్రేక్షకుల కోసం ఈ మూవీని సెప్టెంబర్ 21న కాకుండా మరో తేదీన రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. జీ 5 కాకుండా మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ విడుదలయ్యే అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. అయితే జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.
జన నాయగన్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ కావాల్సి ఉండగా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసేందుకు నిరాకరించింది. దాంతో ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. దీనికితోడు మూవీ ఆన్ లైన్ లో పైరసీ రావడం, తమిళనాడు లోకల్ ఛానెల్ లో టెలికాస్ట్ అవ్వడం వంటివి సినిమా బజ్ ను కొంతమేర దెబ్బతీశాయి. మొత్తానికి విజయ్ చివరి సినిమా ప్రేక్షకులను నిరాశపర్చిందనే చెప్పాలి.

విజయ్ 'జన నాయగన్' చిత్రంలో పూజా హెగ్డే ఫీమేల్ లీడ్ లో నటించింది. మలయాళ బ్యూటీ మమితా బైజు స్పెషల్ రోల్ లో కనిపించింది. బాలీవుడ్ సీనియర్ నటుడు బాబీ డియోల్ నెగిటివ్ రోల్ చేశారు. ఇక ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, ప్రియమణి, గౌతమ్ మీనన్ తదితరులు ఆయా పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా.. కేవీఎన్ బ్యానర్ పై వెంకట్ నారాయణ నిర్మించారు.


Click it and Unblock the Notifications