ఎంత కష్టమొచ్చిందో!: రోడ్డు పక్కన టార్పాలిన్ టెంట్లో మాజీ ఎమ్మెల్యే
ర్హ్ శంకర్: భారతదేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో దేశవ్యాప్తంగా జోరు వానలు ఊపందుకుంటున్నాయి. ఈ తరుణంలో పంజాబ్లోని హోషియార్ పూర్ జిల్లా... గర్హ్ శంకర్ సిటీలో రహదారి పక్కన టార్పాలిన్ టెంటు వేసుకుని ఓ కుటుంబం నివశిస్తోంది. ఈ కుటుంబంపై ఇప్పుడు జాతీయ మీడియా దృష్టి సారించింది.
ఎందుకంటే ఈ కుటుంబ పెద్ద శింగార రాం షహుంగ్రా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడమే. అంతేకాదు తన పదేళ్ల ఎమ్మెల్యే పదవీ కాలంలో ఎక్కడా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు కూడా లేవు. అందుకేనేమో ఇప్పుడు కుటుంబంతో సహా నడిరోడ్డుపై నివసిస్తున్నారు. కట్టుబట్టలతో సహా భార్య బిడ్డలతో కలిసి ఓ రోడ్డు పక్కనే కాలం వెల్లదీస్తున్నారు.
బహుజన సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన దేశంలోని అత్యంత ధనిక రాష్ట్రాల్లో ఒకటిగా పేరుగాంచిన పంజాబ్ నుంచి రెండు మార్లు ఎమ్మెల్యేగా పనిచేసి కనీసం ఓ ఇల్లు నిర్మించుకోలేకపోయిన ఏకైక వ్యక్తని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' గురువారం ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
వివరాల్లోకి వెళితే బహుజన సమాద్వాదీ పార్టీ వ్వవస్థాపక అధ్యక్షుడు కాన్సీరాం ఉన్న సమయంలో శింగార రాం షహుంగ్రా 1992, 1997 సంవత్సరాల్లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎస్సీ సామాజికి వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ రెండుసార్లు కూడా జనరల్ స్థానం నుంచే గెలుపొందారు.
దివంగత బీఎస్పీ మహానేత కన్షీరాం ఆఖరి రోజుల్లో ఆయన కుటుంబం వద్దకు వెళ్లకుండా చేశారనే కారణంతో తనను బీఎస్పీ నుంచి వెలేశారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయన్ని పార్టీ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో మొన్నటి వరకు ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్కు చెందిన హౌస్లో కాలం వెళ్లదీయగా తాజాగా పంజాబ్ ప్రభుత్వం వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించింది.
కాగా అందులో అక్రమంగా ఉంటున్నాడన్నది ప్రభుత్వ వాదిస్తోంది. దీంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిలో రోడ్డు పక్కనే ఓ డేరా కట్టుకొని నివసిస్తున్నారు. "మాజీ ఎమ్మెల్యేగా నాకు కేవలం రూ. 20 వేలు పెన్షన్ వస్తోంది. ఓ అద్దె ఇంటి కోసం వెతుతుకున్నాను. అప్పటి వరకూ మాకు ఆకాశమే పైకప్పు" అని మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
తాను పదవిలో ఉండగా రూపాయి కూడా లంచం తీసుకోలేదని, అవినీతికి పాల్పడలేదని, కనీసం సొంత నివాసం నిర్మించుకునే ఆలోచన కూడా చేయలేదని అన్నారు. ఊర్లో కష్టం చేసుకుని బతికే తమ సోదరులు మాత్రం చక్కగా ఇల్లుకట్టుకొని జీవిస్తున్నట్లు చెప్పారు.
కోర్టు ఆర్డర్ ఉందని చెబుతూ, పోలీసులు బలవంతంగా ఇంటి నుంచి ఖాళీ చేయించారని, నిమ్న కులాల అభ్యున్నతికి కృషి చేయడమే తన తప్పై పోయిందని, ఏనాడూ తాను డబ్బు సంపాదించాలని భావించలేదని, అదే నేటి తన స్థితికి కారణమని ఆయన వాపోయారు.