Fact Check : రైతు నేత రాకేశ్ టికాయిత్ను పోలీసులు అరెస్ట్ చేశారా...?
రైతు ఉద్యమ నాయకుడు,భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని... రాకేశ్ టికాయిత్ను అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు.
రాకేశ్ టికాయిత్ను అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాంటి వార్తలను ఎవరూ నమ్మవద్దని... వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని అన్నారు. బీకేయూ మీడియా ఇన్చార్జి ధర్మేంద్ర మాలిక్ మాట్లాడుతూ.. రాకేశ్ టికాయిత్ను అరెస్ట్ చేశారన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆయన ఇప్పటికీ ఘాజీపూర్లోని రైతు శిబిరం వద్దే ఉన్నారని తెలిపారు.
గత ఆర్నెళ్లకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్,టిక్రీ,సింఘు బోర్డర్లలో రైతులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పలుమార్లు కేంద్రానికి,రైతులకు మధ్య చర్చలు జరిగినప్పటికీ అవేవీ సఫలం కాలేదు. ఏడాదిన్నర పాటు ఆ చట్టాలను పక్కనపెట్టేందుకు కేంద్రం ముందుకు రాగా... రైతులు అందుకు అంగీకరించలేదు. ఆ చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఆ చట్టాలతో రైతులు ఘోరంగా దెబ్బతింటారని... కార్పోరేట్ దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన దుస్థితి తలెత్తుతుందని వారు వాపోతున్నారు. అయితే కేంద్రం మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతోంది. రైతుల ఆదాయం మరింత మెరుగయ్యేందుకు ఈ చట్టాలు దోహదపడుతాయని చెబుతోంది. కేంద్రం దిగిరాకపోవడంతో రైతులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు.
Fact Check
వాదన
బీకేయూ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయలేదు.
వాస్తవం
పోలీసులు రాకేశ్ టికాయిత్ను అరెస్ట్ చేయలేదు.