బీజేపీకి అన్నామలై రాజీనామా
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం అక్కడి రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమిలో లుకలుకలు తలెత్తినట్టు కనిపిస్తోన్నాయి. ఇప్పటికే ఏఐఏడీఎంకేలోని ఒక వర్గం టీవీకేకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తోంది. ఫ్లోర్ టెస్ట్ లోనూ ఆ పార్టీకే ఓటువేశారు ఆ వర్గానికి చెందిన శాసనసభ్యులు.
ఈ పరిణామాలు ఇప్పుడు బీజేపీకీ పాకాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. తమిళనాడు బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై సొంతంగా వేరుకుంపటి పెట్టబోతోన్నారనే ప్రచారం జరుగుతోండటమే దీనికి నిదర్శనం. ఆయనకు మద్దతుగా రాష్ట్రంలో పలుచోట్ల పోస్టర్లు, బ్యానర్లు సైతం వెలిశాయి. ప్రత్యేకించి దక్షిణ తమిళనాడు జిల్లాల్లో వీటి తీవ్రత అధికంగా ఉంది. బీజేపీ నుంచి బయటికి వచ్చి, విజయ్ తరహాలో కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలో అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్కు అందజేశారు. ఈ సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం ఆయన నేరుగా చెన్నైకి బయలుదేరనున్నారు. అంతకుముందే ఆయన నితిన్ నబీన్ తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తోనూ సమావేశం అయ్యారు.
కాగా.. అన్నామలై రాజీనామా వ్యవహారంపై గత కొంతకాలంగా తీవ్ర చర్చ నడుస్తోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ను నియమించిన నాటి నుండి అన్నామలై పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తోన్నారు. పార్టీలో తనకు భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వచ్చారని, అందుకే దూరం జరగాలని నిర్ణయించుకున్నారనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. బీజేపీతో ఎటువంటి ఘర్షణ వైఖరికి పోకుండా సౌహార్దపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. రాజకీయంగా సొంత మార్గాన్ని ఏర్పరచుకోవాలని అన్నామలై పార్టీ అధిష్టానానికి తెలియజేసినట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications