నాకు గర్భస్రావం అవ్వడానికి కారణం సీఎం విజయ్..!
తమిళ సినీ నటి జూలీ చేసిన ఆరోపణలు తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు మాట్లాడుతూ సీఎం విజయ్, ఆయన టీవీకే (Tamilaga Vettri Kazhagam) పార్టీకి చెందిన కొందరు మద్దతుదారుల వేధింపుల కారణంగానే తనకు గర్భస్రావం జరిగిందని ఆరోపించారు. ఈ ఘటన తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని విషాదమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియా ట్రోలింగ్పై తీవ్ర ఆరోపణలు..
జూలీ మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియా వేదికగా తనపై తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో పాటు, తన కుటుంబాన్ని కూడా అవమానించే పోస్టులు, వీడియోలు ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ నిరంతర వేధింపుల కారణంగా తాను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యానని చెప్పారు. గర్భవతిగా ఉన్న సమయంలోనూ ఈ ట్రోలింగ్ ఆగకపోవడంతో తన ఆరోగ్య పరిస్థితి దెబ్బతిందని, చివరకు గర్భస్రావానికి దారితీసిందని జూలీ పేర్కొన్నారు.

ఈ ఏడాది మార్చి నెలలోనే ఈ వ్యవహారంపై జూలీ అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తనపై సోషల్ మీడియాలో దూషణలు, బెదిరింపులు చేసిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేయాలని కోరినట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేధింపులతో పాటు తన భర్తను కూడా లక్ష్యంగా చేసుకున్నారని జూలీ ఆరోపించారు. రూ.15 లక్షల విలువైన కిడ్నీ స్కామ్ కేసులో తన భర్తను కావాలనే ఇరికించారని ఆమె పేర్కొన్నారు. ఆ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా, ఉద్దేశపూర్వకంగా నోటీసులు పంపిస్తూ వేధిస్తున్నారని చెప్పారు.
ఈ వ్యవహారం వెనుక టీవీకేకు చెందిన కొందరు వ్యక్తులు, ఒక న్యాయవాది ఉన్నారని కూడా జూలీ ఆరోపించారు. తమ కుటుంబ పరువును దెబ్బతీయడానికి పన్నిన కుట్రలో భాగంగానే ఈ చర్యలు జరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగానే జూలీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు ఇటీవలే వివాహమైందని.. మొదటి బిడ్డ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశామన్నారు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదని.. మానసిక వేధింపులు, అవమానాలు, నిరంతర ఒత్తిడి కారణంగా బిడ్డను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక సానుభూతి కోసం తాను ఈ విషయాన్ని ప్రస్తావించడం లేదని.. తన కుటుంబం ఎదుర్కొన్న వేదన గురించి ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నానని అన్నారు. సోషల్ మీడియాలో ఎవరినైనా లక్ష్యంగా చేసుకుని చేసే దాడులు ఎంతటి విషాదాలకు దారితీస్తాయో సమాజం గుర్తించాలి" అని జూలీ అన్నారు. జూలీ చేసిన ఆరోపణలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా టీవీకే పార్టీ మద్దతుదారులపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలపై టీవీకే పార్టీ లేదా విజయ్ తరఫున ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.












Click it and Unblock the Notifications