Fact check : బీజేపీ శ్రీలంకలో అడుగుపెట్టిందా... అక్కడ కూడా పార్టీని స్థాపించిందా...?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటీవల శ్రీలంకలోనూ తమ పార్టీని లాంచ్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది. శ్రీలంక బీజేపీకి ముత్తుస్వామి అనే శ్రీలంకన్ పౌరుడిని అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ ప్రచారంలో పేర్కొంటున్నారు. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదు. బీజేపీ శ్రీలంకలో తమ పార్టీని లాంచ్ చేయలేదు. శ్రీలంకలో బీజేపీ కార్యకలాపాల పేరిట సాగుతున్న ప్రచారమంతా అసత్యమనే చెప్పాలి.
నేపాల్,శ్రీలంకల్లోనూ బీజేపీ... త్రిపురం సీఎం వ్యాఖ్యలపై లంక ఎన్నికల కమిషన్ రియాక్షన్...
భారతీయ మూలాలున్న వి.ముత్తుస్వామి ఇటీవల శ్రీలంకలో ఇలంకి భారతీయ జనతా కచ్చి(IBJK) పార్టీని స్థాపించారు. దీన్నే శ్రీలంక బీజేపీ అని కూడా పిలుస్తున్నారు. అయితే భారత్లోని బీజేపీయే శ్రీలంకలో ఈ పార్టీని స్థాపించిందన్న ప్రచారం మొదలైంది. కొద్దిరోజుల క్రితం త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ కుమార్... బీజేపీని శ్రీలంక,నేపాల్లోనూ విస్తరించనున్నట్లు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. బహుశా ఇలాంటి వ్యాఖ్యలు కూడా ఈ ప్రచారానికి కారణమయ్యాయేమో...!!
శ్రీలంక బీజేపీ వ్యవస్థాపకుడు ముత్తుస్వామి మాట్లాడుతూ.. శ్రీలంకలోని తమిళులు విద్యాపరంగా,క్రీడాపరంగా అభివృద్ది సాధించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకే ఈ పార్టీని స్థాపించినట్లు స్పష్టం చేశారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి,శ్రీలంక బీజేపీకి ఎక్కడా ఎటువంటి లింకులు లేవు.
నిజానికి ఒక దేశానికి చెందిన రాజకీయ పార్టీ మరో దేశంలో తమ పార్టీని ఏర్పాటు చేయాలంటే అక్కడి రాజ్యాంగం,చట్టం అందుకు ఒప్పుకోవాలి. త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ కుమార్ బీజేపీ అధిష్టానం తమ పార్టీని శ్రీలంకలో విస్తరించే యోచనలో ఉందని కామెంట్స్ చేసినప్పుడు లంక ఎన్నికల కమిషన్ దీనిపై స్పందించింది. శ్రీలంకకు చెందిన రాజకీయ పార్టీలు ఏవైనా ఇతర దేశాల్లోని సంస్థలు లేదా పార్టీలతో సంబంధం కలిగి ఉండవచ్చు గానీ విదేశీ రాజకీయ పార్టీలు నేరుగా శ్రీలంకలో అడుగుపెట్టేందుకు అక్కడి చట్టాలు అనుమతించవు అని లంక ఈసీ స్పష్టం చేసింది. కాబట్టి లంకలో బీజేపీ నేరుగా అడుగుపెట్టే అవకాశం లేదని చెప్పాలి.
Fact Check
వాదన
శ్రీలంకలో బిజెపి యూనిట్ ప్రారంభించింది
వాస్తవం
భారతదేశ బిజెపితో ఎటువంటి సంబంధం లేదు