Fact Check: వాట్సాప్ ద్వారా కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ నిజమేనా? కేంద్రం షాకింగ్ వివరణ
భారత్ లో రెండో దశ కరోనా వ్యాప్తి దావానలంలా వ్యాప్తిస్తున్నది. కొత్త కేసులు, మరణాలు గుట్టలా పెరిగిపోతున్నాయి. సర్వత్రా ఆందోళనలను పెరుగుతుండగా, ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. అయితే, కొవిడ్ పట్ల జనాల్లో నెలకొన్న భయాలను క్యాష్ చేసుకునేందుకు కొందరు దుర్మార్గులు కొత్త ఎత్తులు రచించారు. తప్పుడు వార్తలను, ఫేక్ సమాచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చి అమాయకుల్ని బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 'వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్' వ్యవహారం కూడా అలాంటిదేనని కేంద్రం హెచ్చరిస్తున్నది.
వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ అంటూ..
కొవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)' చాలా కాలంగా కీలక సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నది. సోషల్ మీడియాలో పీఐబీ పేరిట విడుదలయ్యే ప్రకటనలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. కాగా, ఇదే పీఐబీ పేరుతో కొద్ది రోజులుగా ఓ సందేశం వ్యాప్తిలోకి వచ్చింది. వాట్సాప్ యాప్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియకు పేర్లను నమోదు చేయించుకోవచ్చని ఆ ప్రకటన సందేశం. వాట్సాప్ ద్వారా ఫలానా (ఆ ప్రకటనలో సూచించిన) ఫోన్ నంబర్ కు 'హాయ్' అని మెసేజ్ చేయాలని, ఆ తర్వాత ఆధార్, పాన్, ఓటర్ ఐడీ తదితర వివరాలను పొందుపర్చాలని, మీరు ఉండే ఏరియా పిన్ కోడ్ నంబర్, వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటోన్న ఆస్పత్రి వివరాలను అడుగుతోన్న ఆ సందేశం విపరీతంగా షేర్ అవుతూ వైరల్ గా మారింది. కానీ ఇది వట్టి మోసమని పీబీఐ స్పష్టం చేసింది..
వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ వట్టిదే
సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియకు పేరు నమోదు చేసుకోండంటూ వైరలవుతోన్నది ఫేక్ సమాచారమని, అలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలెవరూ నమ్మొద్దని పీఐబీ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ను విడుదల చేసింది. వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ వట్టి అబద్ధమని, అసలా పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు అవకాశమే లేదని పీఐబీ స్పష్టం చేసింది. ప్రజలెవరూ ఆ సందేశాన్ని నమ్మవద్దని, ఆధార్, ఇతర ఐడీల వివరాలను ఆ వాట్సాప్ నంబర్ కు పంపరాదని సూచించింది. నిజానికి..
కొవిన్, ఆరోగ్య సేతు ద్వారా మాత్రమే..
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం పకగ్బందీగా నిర్వహిస్తున్నదని, వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్లు అబద్ధమన్న పీఐబీ.. కేవలం కొవిన్ వ్యవస్థ, ఆరోగ్య సేతు యాప్ ల ద్వారా మాత్రమే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్లను కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. కొవిన్, ఆరోగ్య సేతు కాకుండా ఇతర మార్గాల్లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేయడం లేదని, అలా చేస్తున్నట్లు వచ్చే సమాచారం ముమ్మాటికీ తప్పుడుదేనని పీఐబీ పేర్కొంది.
వ్యాక్సిన్ కోసం రెండు దారులు
ప్రస్తుతం మన దేశంలో 45 ఏళ్ల పైబడిన అందరికీ వ్యాక్సిన్లు అందిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన Co-WIN ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకోవాలి. https://www.cowin.gov.in/ వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్కు ఓటీపీ ద్వారా వెరిఫికేషన్, ఐడీ ప్రూఫ్ వివరాల ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అలాగే, Aarogya Setu (ఆరోగ్య సేతు) యాప్లో ద్వారా కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియలో మన పేరును రిజిస్టర్ చేయించుకోవచ్చు. స్మార్ట్ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఆ యాప్ హోమ్ స్క్రీన్పై కనిపించే CoWin లింక్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత వ్యాక్సినేషన్ ఆప్షన్ లోకి వెళ్లి మొబైల్ నంబర్, ఐడీల వెరిఫికేషన్ ద్వారా వ్యాక్సిన్ పొందొంచ్చు. కొవిన్, ఆరోగ్య సేతు తప్ప మిగతా దారుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉండబోదని కేంద్రం స్పష్టంగా చెబుతోంది.
Fact Check
వాదన
వాట్సాప్ ద్వారా కోవిడ్ టీకా కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు
వాస్తవం
కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్యసేతు యాప్ ద్వారా మాత్రమే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు