సీతారాం ఏచూరి సీమాంధ్ర ఆధిపత్య కుట్ర?

పుచ్చపల్లి సుందరయ్య ప్రతిపాదించిన విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే తీర్మానాన్ని కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ నిరాకరించింది. ఆ నిరాకరించిన తీర్మానాన్ని సిపిఎం అధికారిక తీర్మానంగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నది. అటువంటి తప్పుడు వారసత్వానికి సీతారాం ఏచూరి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పడానికి తాజా విశాలాంధ్ర మహాసభ అని చెప్పడానికి వెనకాడాల్సిన అవసరం లేదు. ఈ సమావేశంలో ప్రసంగించినవారికి ఏదో మేరకు మేధావులనే గుర్తింపు సామాన్య ప్రజానీకంలో ఉంది. దాన్ని ఆసరాగా తీసుకుని సిపిఎం దొడ్డి దారిన తెలంగాణ వ్యతిరేక లక్షణాన్ని బయట పెట్టుకుంది. ప్రధాని సలహాదారుగా పనిచేసిన సంజయ బారు కూడా అదే వారసత్వానికి చెందినవారు. రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆయనగారు సెలవిస్తున్నారు. ఇప్పటి దాకా ఏదైనా న్యాయం జరిగితే ఇక ముందు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని అంగీకరించడానికి వీలవుతుంది. తెలంగాణ వనరులను కోస్తా ఆధిపత్య పర్గాలు దోచుకుపోతున్నాయనే దశాబ్దాల ఆవేదనే నేటి తెలంగాణ ఉద్యమ ఉధృతికి దారి తీసిందనే విషయాన్ని ఆ మేధావి గుర్తించలేకపోయారు.
రాష్ట్రం రెండుగా విడిపోతే కచ్చితంగా మూడవుతుందని ఆయన జోస్యం చెబుతున్నారు. మూడు రాష్ట్రాలు ఏర్పడితే నష్టమేమి లేదనేది తెలంగాణ మేధావులు ఆలోచన. ఈ విషయంపై తెలంగాణ మేధావులు గత దశాబ్ద కాలంగా మాట్లాడుతూనే ఉన్నారు. వారు సమస్యను ముందుకు తెచ్చినప్పుడు సంజయబారు లాంటి మేధావులు మాట్లాడాల్సింది. ఇప్పుడు మాట్లాడడంలో ఆంతర్యం కేవలం తెలంగాణ విషయంలో తీవ్రమైన ఒత్తిడి రావడం వల్ల కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ ఏర్పాటుకు మొగ్గు చూపుతుందనే భయంతోనే కావచ్చు. కన్నడిగులు, మరాఠీలు, బెంగాలీలు, గుజరాతీలకు ఒకే రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగువారు ఎందుకు విడిపోవాలని అనుకుంటున్నారో అని సందేహం వ్యక్తం చేసిన ఆయనగారు అసలు మూలాలను చూడడానికి నిరాకరిస్తున్నారు. భాష అనేది ఉపరితలాంశం మాత్రమే. అయితే, హిందీవారికి ఒక్కటి కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఉన్నాయనే విషయాన్ని ఆయన ఎందుకు ప్రస్తావించలేదో మరి.
పాత్రికేయుడు కులదీప్ నయ్యర్కు తెలంగాణలో ఏదో మేరకు ఆదరణ ఉంది. ఆయన తెలంగాణ వ్యతిరేకత వల్ల, అందుకు ఆయన చూపిన కారణాల వల్ల ఆ ఆదరణను కోల్పోయే స్థితి వచ్చింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు అనే పేరుతో నర్రా మాధవరెడ్డిని ముందు పెట్టారు. తెలంగాణ కావాలంటున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి తన రాష్ట్ర విభజనను ఎందుకు అడగడం లేదని ఆయన అంటున్నారు. ఆయనకు ఏ మేరకు పరిణామాల పట్ల అవగాహన ఉందో ఈ మాటలే తెలియజేస్తున్నాయి. ఆమె ఉత్తరప్రదేశ్ విభజనను కూడా కోరుకుంటున్నారనే విషయం తెలుసుకుని మాట్లాడితే బాగుండేది.
కాగా, ఈ సమావేశానికి వచ్చిన కొద్ది మంది జెఎన్యు తెలంగాణ విద్యార్థులు తమకు పది నిమిషాల సమయం ఇవ్వాలని, తెలంగాణ ఎందుకు కావాలో చెబుతామని డిమాండ్ చేశారు. వారికి సమావేశ నిర్వాహకులు సమయం ఇవ్వలేదు. అది నిర్వాహకుల ఇష్టంగా తీసేయడానికి వీలుంది. కానీ, మొత్తంగా సమావేశం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేధావులు వ్యతిరేకంగా ఉన్నారనే అభిప్రాయాన్ని కాంగ్రెసు అధిష్టానం వద్దకు తీసుకుని వెళ్లడమే సీతారాం ఏచూరి గారి ప్రధాన లక్ష్యమని చెప్పవచ్చు.
- కె. నిశాంత్
రచయిత అభిప్రాయాలతో వన్ ఇండియా తెలుగుకు ఏ విధమైన సంబంధం లేదు. పాఠకులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు.












Click it and Unblock the Notifications