కోవూరు ఫలితం జగన్కు భారీ విజయమే
పరిస్థితులను, అంచనాలు ఒక్కసారి పరిశీలిద్దాం. వైయస్సార్ కాంగ్రెసుకు మద్దతుగా అప్పటి తెలుగుదేశం పార్టీ సభ్యుడు ప్రసన్న రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. ఈ విజయాన్ని గొప్ప విజయంగా ఎందుకు చెప్పాలో, కాంగ్రెసు, తెలుగదుశం పార్టీలు ఎందుకు నష్టపోయాయో చూద్దాం -
1. మూడు పార్టీల వ్యవస్థలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కొత్తగా పుట్టింది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు అప్పటికే లోతుగా చొచ్చుకుపోయి ఉన్నాయి. పైగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని నిలువరించడానికి ఆ రెండు పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నించాయి.
2. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు పెద్ద యెత్తున డబ్బులు కుమ్మరించాయి. ఆ పార్టీలు పెట్టిన వ్యయంతో పోలిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పెట్టిన ఖర్చు లెక్కలోకి కూడా రాదు.
3. రాష్ట్రావతరణ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు విజయానికి సగటు మెజారిటీ ఏడెనిమిది వేలకు మించి లేదు. ఈ విధంగా చూస్తే కోవూరులో వైయస్సార్ కాంగ్రెసుకు లభించిన మెజారిటీ భారీగానే ఉందని చెప్పాలి. పులివెందుల, కడప ఉప ఎన్నికలతో పోల్చి ఎక్కువగా ఊహించుకున్నారు.
4. 1983 నుంచి తెలుగుదేశం బలంగా ఉన్న రాష్ట్రంలోని ఐదు నియోజకవర్గాల్లో కోవూరు ఒకటి. 2004 ఎన్నికల్లో మాత్రమే వైయస్సార్ హవాలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అది కూడా 500కు తక్కువ మెజారిటీతో మాత్రమే.
5. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మెజారిటీ తగ్గడాన్ని జగన్కు కూడా ఆపాదించాలి. వోట్ల కోసం అన్ని ప్రయత్నాలను ఆయన చేయలేదు. ప్రజల స్వచ్ఛంద మద్దతు ద్వారా మాత్రమే ఆయన ఓట్లు పొందే విధంగా ప్రచారం సాగించారు.
6. సిట్టింగ్ శాసనసభ్యుడిపై సాధారణంగా ఉండే వ్యతిరేకత కూడా పనిచేసింది.
నిజానికి, కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెసు నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. దానికి బదులుగా త్వరలో జరిగే నెల్లూరు పార్లమెంటు సీటుకు తెలుగుదేశం పార్టీ మద్దతును కాంగ్రెసు పొందాలని భావించింది. లగడపాటి నిశిత దృష్టి కాంగ్రెసు, తెలుగదేశం పార్టీలను చిక్కుల్లో పడేయకుండా కాపాడింది. తెలుగుదేశం పార్టీని బలపరచడానికి బదులు ముక్కోణపు పోటీకే సిద్ధపడాలని, తద్వారా డిపాజిట్ దక్కించుకుని, వైయస్సార్ కాంగ్రెసు మెజారిటీ తగ్గించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీని బలపరిచి ఉంటే, కాంగ్రెసు ఓట్లన్నీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పడేవి. తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గమైన కోవూరులో పాగా వేయడం ద్వారా వైయస్సార్ కాంగ్రెసు సీమాంధ్రలో తన సత్తాను చాటగలదని అర్థమవుతోంది. 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు సీమాంధ్రలో స్వీప్ చేస్తుందని చెప్పవచ్చు. వచ్చే 18 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని దెబ్బ తీయడానికి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కు కావచ్చు. పరస్పర అంగీకారంతో ఒక పార్టీ బలమైన అభ్యర్థిని నిలిపితే మరో పార్టీ బలహీనమైన అభ్యర్థిని పెట్టే విధంగా ఆలోచన చేయవచ్చు.
వైయస్ జగన్ ప్రజా మద్దతు ఉన్న నాయకుడని తేలిపోయింది. విశ్వసనీయత గల నాయకుడిగా ఆయన రుజువు చేసుకున్నారు. రాష్ట్రంలో నూతన రాజకీయాలకు పునాదులు వేస్తున్న జగన్ను అభినందించక తప్పదు.
- గురువారరెడ్డి, అట్లాంటా