న్యూయార్క్ మ్యూజియంకు ఎక్కనున్న బాలీవుడ్తార ఎవరు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) తెలంగాణలో త్రిముఖ పోటీకి తెర లేపింది. కాంగ్రెస్తో పొత్తు ఉండదని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు తేల్చి చెప్పారు. ఇది కాంగ్రెస్కు ఏ మాత్రం మింగుడుపడని వ్యవహారం. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు అనే పద్ధతిలో తెలుగుదేశం పార్టీపై పోరుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్కు టిఆర్ఎస్ నిర్ణయం పెద్ద దెబ్బ.
కాంగ్రెస్తో పొత్తు కోసం కళ్లు కాయలు కాచాలే ఎదురు చూసిన కెసిఆర్ ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. ఒంటరిపోరుకే ఎందుకు కాలు దువ్వుతున్నారు? కెసిఆర్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. తెలంగాణలో ఒంటరి పోరుకు సిద్ధపడడం అంత సులభమేమీ కాదు. ఇప్పటికే కొంత మంది తిరిగి తమ మాతృసంస్థల్లోకి వెళ్లిపోయారు. దీని వల్ల కొంత మేరకు పార్టీ బలహీనపడిందనే వార్తలు వస్తున్నాయి. స్థానిక సంస్థల నాటి ఊపు టిఆర్ఎస్కు ఇప్పుడు లేదనే అభిప్రాయం వ్యాపించింది. దీనికి ప్రధాన కారణం- తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కొనసాగించడానికి నిరంతర కార్యక్రమాలను కెసిఆర్ ఇవ్వకపోడం. పొత్తుల చర్చల్లో పడిపోయి తాత్సారం చేయడం వల్ల మరింత స్తబ్దత ఆవరించినట్లు కనిపిస్తోంది. పొత్తు పెట్టుకుంటే పార్టీ అస్తిత్వం మరింత దెబ్బ తినే ప్రమాదం కూడా ఉందనే అభిప్రాయం క్యాడర్లో ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు స్పష్టంగా ముందుకు రాకపోతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకూడదని టిఆర్ఎస్ నాయకుడు ఎ. నరేంద్ర అభిప్రాయపడుతున్నారు. సాంకేతికంగా ఆయన ఇంకా బిజెపి పార్లమెంటు సభ్యుడిగానే కొనసాగుతున్నారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే కెసిఆర్నైనా ఎదిరిస్తామని ఆయన ఒక బహిరంగ ప్రకటన చేశారు. ఇదే కనుక జరిగితే ఆదిలో తమ రాజకీయాలకు గండి పడుతుందనేది కెసిఆర్కు తెలుసు. అందువల్ల ఆయన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే దిశ నుంచి మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇక మూడో విషయం- పొత్తులతో సంబంధం లేకుండా చాలా మంది నాయకులు తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్తో గానీ, వామపక్షాలతో గానీ పొత్తులు పెట్టుకుంటే కొన్ని ప్రధానమైన అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా వదిలేయాల్సి వస్తుంది. దీని వల్ల పార్టీలో సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. పార్టీ బలం పెద్దగా లేని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థి బలం పార్టీకి ఊపునిచ్చే అవకాశాలున్నాయి. ఈ నియోజకవర్గాలు ఇతర పార్టీలకు కేటాయించాల్సి వస్తే ఆ నియోజకవర్గాల్లో ఉద్యమం దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఉదాహరణకు- మిర్యాలగూడలో తిప్పన విజయసింహారెడ్డి, నక్రేకల్లో చెరుకు సుధాకర్. ఈ నియోజకవర్గాలను పొత్తులు కుదిరితే ఇతర పార్టీలకు వదిలేయాల్సి వుంటుంది. దాని వల్ల పార్టీకి కాకుండా ఉద్యమానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఒక వేళ వామపక్షాలు కాకపోయినా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బేషరతుగా ముందుకు వస్తే అలా వదిలేస్తే కొంత మేరకు న్యాయం చేకూరుంది. అలా ముందుకు వచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఒక వేళ చివరి నిమిషంలో ముందుకు వచ్చినా ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
ఇక, వామపక్షాల విషయానికి వస్తే, పిడికెడు బలంతో కొండెక్కి కూతలు పెట్టే ధోరణి ఆ పార్టీలు అవలంభిస్తున్నాయి. సిపిఎం ధోరణి టిఆర్ఎస్కు ఏ మాత్రం పడేది కాదు. సిపిఐ కొంత మెతకగా ముందుకు వస్తున్నప్పటికీ అది టిఆర్యస్కు మేలు చేసేదేమీ కాదు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పూర్తిగా వామపక్షాల ప్రభావంలో పడిపోదనే గ్యారంటీ ఏమీ లేదు. ఇప్పటికే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) మాజీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి వామపక్షాలు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బద్ధవ్యతిరేకి. తెలంగాణ నేతల మాటలు అమలులోకి వస్తాయనే గ్యారంటీ కాంగ్రెస్ ఎప్పుడూ లేదు. అందువల్ల కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే నెరవేరేది కాంగ్రెస్, వామపక్షాల లక్ష్యమే తప్ప టిఆర్ఎస్ లక్ష్యం కాదు.
ఇదంతా జాగ్రత్తగా ఆలోచించే పొత్తులకు దూరంగా ఉండాలని కెసిఆర్ నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ విషయంలో తెలుగుదేశం ఓడినా, గెలిచినా ఒరిగేదేమీ లేనప్పుడు పొత్తులు పెట్టుకుని సాధించేదేమిటనేది కూడా కెసిఆర్ ప్రశ్నించుకుని ఉంటారు.












Click it and Unblock the Notifications