తెలంగాణ సినిమాల కొలిమి, జై తెలంగాణ
రతణాల వీణ సినిమాను వీధి మలుపుల్లో ప్రజల కోసం ఉచితంగా ప్రదర్శించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీ భవనాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రదర్శించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. దీన్ని థర్జ్ ఫిల్మ్ కాన్సెప్ట్గా అభివర్ణిస్తున్నారు. సినిమా చూసినవారు తమకు తోచిన మేరకు డబ్బులు ఇవ్వవచ్చునని అంటున్నారు. ఈ సినిమా నిర్మాత టైటిల్ను ప్రజలే అని వేస్తున్నారు. సినిమాకు నర్సింహారావు పెట్టుబడి పెట్టారు. అయితే, కళాకారులు మాత్రం ఉచితంగా సేవలు అందించారు.
శివాజీ ప్రధాన పాత్ర పోషించిన కొలిమి సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను జి. ఉమా పార్వతి, పి. లావణ్య రెడ్డి నిర్మించారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు రాసిన పాట కూడా ఉంది. సినిమా కోసం కెసిఆర్ రాసిన రెండో పాట ఇది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాలో ఆయన ఓ పాట రాశారు. మేలో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. విద్యార్థుల బలిదానాలు ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.
జై బోలో తెలంగాణ సినిమా ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. దీని దర్శక నిర్మాత శంకర్ ఆ సినిమాకు సీక్వెల్ను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక ఉద్యమం పతాక స్థాయికి చేరిన ప్రస్తుత తరుణంలో ఆలస్యం చేయకూడదని ఆయన భావిస్తున్నారు.