తమిళనాడు రైలు ప్రమాదం: భాస్వరమా, స్టౌ పేలుడా?

ప్రమాద ఘటనపై గురు, శుక్రవారాలలో నెల్లూరులో రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ విచారణ ముగిసింది. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను సోమవారం రైల్వే ఉన్నతాధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నారు. దర్యాప్తులో భాగంగా అధికారులు ఎస్-11 బోగీ నుంచి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. 45వ బెర్త్ వద్ద పాలు కాచుకునే గిన్నె, మూత, ఒక క్యారియర్, పట్టకారు, చిన్న గ్యాస్ సిలిండర్, మందపాటి రేకు దొరికాయని అంటున్నారు.
రంజాన్ మాసం కావడంతో ఎవరైనా సహర్ను ప్రారంభించడానికి పాలు కాచుకునేందుకు గ్యాస్స్టవ్ను వెలిగించి ఉంటారని, దాంతోనే పేలుడు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ప్రమాదం స్టౌవ్ వల్ల జరిగిందా లేదా ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలున్నాయా అన్నదానిపై అధికారులు ఇంకా నిర్ధారణకు రాలేదు. మొత్తానికి మరో మూడు, నాలుగు రోజుల్లో రైలు ఘటన మిస్టరీ వీడిపోతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
తమిళనాడు ఎక్స్ప్రెస్ ఘటనపై శుక్రవారం కూడా దక్షిణ మధ్య రైల్వే డివిజన్ భద్రతా అధికారి డీకే.సింగ్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పలువురు రైల్వే అధికారులను, సిబ్బందిని విచారించారు. తర్వాత నారాయణ వైద్యశాలలో చికిత్స పొందుతున్న 8 మంది బాధితులను విచారించారు.
అనంతరం దర్యాప్తు బృందం నెల్లూరు రైల్వేస్టేషన్కు చేరుకుని, మరికొందరు రైల్వే అధికారులను విచారించింది. దీంతో రెండు రోజుల బహిరంగ విచారణ ముగిసింది. విచారణలో వెల్లడైన అంశాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందజేస్తామని ఓ అధికారి చెప్పారు.
మృతులు 28 మందే..
తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 28 మాత్రమేనని అధికార వర్గాలు ప్రకటించాయి. తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో చిక్కుకుని కాలిన గాయాలతో ఐదు రోజులుగా ప్రాణ పోరాటం చేసిన కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం జువ్వనపూడికి చెందిన మసిముక్కు సాంబశివరావు(35) శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మరణించారు. దీంతో మృతుల సంఖ్య 29కి చేరిందని చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలోని 26 మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించారు. మరో రెండింటిని ఇంకా గుర్తించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications