డ్రగ్స్ రాకెట్: మరోసారి టాలీవుడ్ షేక్
గతంలో రాజశేఖర్ హీరోగా రూపొందిన 'మగాడు', 'శేషు' వంటి చిత్రాలను నిర్మించిన మురళి గత కొంతకాలంగా డ్రగ్స్ కి అలవాటు పడ్డాడని అంటున్నారు. ఆ క్రమంలో కొకైన్ తీసుకుని వెళుతుండగా హైదరాబాదు, జూబిలీ హిల్స్ ప్రాంతంలో మాటువేసిన వెస్ట్ జోన్ డీసీపీ బృందం మురళీని అరెస్ట్ చేసింది.
మాదక ద్రవ్యాలకు సంబంధించి తమ వద్ద 60 మంది ప్రముఖుల పేర్లున్నాయని, ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్టు చేస్తామని గతంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్గా పనిచేసిన ఎకె ఖాన్ అప్పట్లో చెప్పారు. ఈ వ్యవహారాల్లో హీరోయిన్లు కూడా ఉన్నారని ఆయన అన్నారు. తెలుగు సినీ ప్రపంచానికి మాదక ద్రవ్యాలకు అవినాభావ సంబంధం ఉందనే విషయం కొత్తది కాదు.
గతంలో దాదార్ ఎక్స్ ప్రెస్ సినిమా నిర్మాత వెంకటేశ్వర రావు, యువత సినిమా నిర్మాత హేమంత్ రామకృష్ణ డ్రగ్ కేసుల్లో అరెస్టయ్యారు. వెంకటేశ్వర రావు 20 కోట్ల రూపాయల విలువ చేసే హెరాయిన్ తో పట్టుబడ్డాడు. హేమంత్ రామకృష్ణ కూడా హెరాయిన్ తో పట్టుబడ్డాడు.
మాదక ద్రవ్యాలకు హైదరాబాదులోని 9 పబ్ లు నిలయంగా మారినట్లు అనుమానిస్తున్నట్లు ఖాన్ అప్పట్లో చెప్పారు. హైదరాబాదులోని బంజారాహిల్స్, జూబిలీ హిల్స్ వంటి సంపన్న వర్గాలు గల ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల వాడకం ఎక్కువగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
గతంలో హీరో వరుణ్ సందేశ్కు కూడా డ్రగ్స్ తలనొప్పి పట్టుకుంది. వరుణ్ సందేశ్ ఉదంతం సినీ ప్రపంచాన్ని ఊపేసింది. త్రిష వంటి హీరోయిన్లకు కూడా ఆ పీడ చుట్టుకుంది. దాని నుంచి బయటపడడానికి అతనికి చాలా సమయమే పట్టింది. తమకు ఏ విధమైన సంబంధాలు లేవని హీరోయిన్లు, నటులు పోటీ పడి చెప్పుకోవాల్సిన స్థితిలో పడ్డారు. ఈ వ్యవహారంతో తెలుగు సినీ ప్రపంచం పెద్దలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.