ద్రవిడ్ స్దానాన్ని భర్తీ చేసే యువ ఆటగాడు ఎవరు..?
బెంగుళూరు, జూన్ 21: ఇటీవల వెస్టిండిస్ 'ఏ' జట్టుతో అనధికారిక మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఇండియా 'ఏ' జట్టు పరాజయాన్ని చవిచూడండతో టీమిండియా టెస్టు బ్యాటింగ్ లైనప్ గురించి బిసిసిఐ పునరాలోచనలో పడింది. ఇందుకు గల కారణం. ఇటీవలే అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుండి ది వాల్ రాహుల్ ద్రవిడ్ రిటైర్ మెంట్ ప్రకటించడంతో ఇప్పడు అతని స్దానాన్ని యువ క్రికెటర్లలలో ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్న అందరి నోటా ఉత్పన్నం అవుతుంది.
ఇందులో భాగంగానే కరేబియన్ దీవుల్లో మూడు టెస్టు మ్యాచ్ల కోసం యువ క్రికెటర్లను బిసిసిఐ పంపడం జరిగింది. ఐతే ఈ మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ వెస్టిండిస్ ఏ జట్టు 2-1 తేడాతో ఇండియా ఏ జట్టుపై గెలిచి సిరిస్ను కైవసం చేసుకుంది. ఇండియా ఏ జట్టులో గతంలో టెస్టు సిరిస్లు ఆడిన యువ క్రికెటర్లు ఉన్నప్పటికీ.. బ్యాటింగ్ వైఫల్యంతో చేజేతులా టెస్టు సిరిస్ను చేజార్చుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)-5వ సీజన్ ముగిసిన అనంతరం యువ క్రికెటర్లు అయిన రోహిత్ శర్మ, అజ్యెంక రహానే, మనోజ్ తివారిలు టెస్టు మ్యాచ్లో తమ సత్తా చాటేందుకు కరేబియన్ దీవులకు పయనమయ్యారు. ఐపిఎల్ 5వ సీజన్లో రోహిత్ శర్మ అధ్బుతమైన విజయాలను అందించాడు. రాజస్దాన్ రాయల్స్ జట్టు తరుపున ఓపెనర్గా, రాహుల్ ద్రవిడ్ సారధ్యంలో అజ్యెంక రహానే చక్కగా రాణించాడు. వీరిద్దరితో పోల్చితే కోల్కత్తా నైట్ రైడర్స్ తరుపున బరిలోకి దిగిన మనోజ్ తివారి యావరేజిగా చక్కని ప్రదర్శనను కనబర్చాడు.
ఐపిఎల్లో చక్కని ప్రదర్శనను కనబర్చి సెలక్టర్ల మనసు దోచిన రోహిత్, రహానే అదే జోరును వెస్టిండిస్ టూర్లో ప్రదర్శించలేకపోయారు. 6 ఇన్నింగ్స్ ఆడిన రహానే 62 పరుగులు చేసి 10.33 యావరేజిగా నిలిచాడు. అదే రోహిత్ శర్మ విషయానికి వస్తే అదే 6 ఇన్నింగ్స్లో 145 పరుగులు చేసి 24.16 యావరేజిగా కొనసాగాడు. రోహిత్ శర్మ వెస్టిండిస్ ఏ జట్టుతో జరిగిన మొదటి టెస్టులో 92 పరుగులు చేసి సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక మనోజ్ తివారి 182 పరుగులు చేశాడు.
ఇక ఇండియా ఏ జట్టు కెప్టెన్ ఛటేశ్వర పుజారా 252 పరుగులు చేసి 50.40 యావరేజితో బ్యాటింగ్ ఆర్డర్లో మొదటి స్దానంలో ఉన్నాడు. మొదటి టెస్టులో పుజారా చక్కగా రాణించ బట్టే మొదటి టెస్టులో ఇండియా ఏ జట్టు వెస్టిండిస్ ఏ జట్టుపై విజయం సాధించింది. టీమిండియా ఆగస్టులో న్యూజిలాండ్తో టెస్టు క్రికెట్ ఆడనుంది. ఆగస్టు 23వ తారీఖున న్యూజిలాండ్తో హైదరాబాద్లో జరగనున్న మొదటి టెస్టులో రాహుల్ ద్రవిడ్ స్దానాన్ని యువ క్రికెటర్లలలో ఎవరు భర్తీ చేయనున్నారనే ఎంపిక బిసిసిఐకు కష్టంతో కూడుకున్న పని.
తెలుగు వన్ఇండియా క్రీడా విభాగం