గోమాత పేరిట పెచ్చరిల్లుతున్న హింస.. ముస్లింలే టార్గెట్: బాధితులపైనే కేసులు
న్యూఢిల్లీ: గోమాత అంటే అహింసకు, ప్రేమకు, నమ్మకానికి, అనుబంధానికి ప్రతిబింబం. కానీ అటువంటి గోమాత మనదేశంలో ఇప్పుడు హింసకు పర్యాయపదంగా మారుతోంది. గోవులను రక్షించే పేరుతో గోరక్షకులు విచ్చలవిడి హింసకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా, ఉత్తరభారతంలో, అందులోనూ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఈ ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి. 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత.. గోరక్షకుల ఆగడాలు మితిమీరుతున్నాయని తెలుస్తున్నది. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ఆక్షేపించినా, సుప్రీంకోర్టు హితవు పలికినా ఇవి ఆగడం లేదు.
ఈ దాడుల్లో బాధితులు అత్యధికులు ముస్లింలే. ఇండియాస్పెండ్ డాట్కామ్ అనే వెబ్ మ్యాగజైన్ ఈ వివరాలను బయట పెట్టింది. గో రక్షణ పేరుతో 2010 నుంచి ఇప్పటివరకూ జరిగిన హింసాత్మక ఘటనలపై ఈ సంస్థ ఒక అధ్యయనం నిర్వహించింది. 2010 నుంచి 78 ఘటనలు జరిగితే ఈ ఏడాదిలో ఇప్పటివరకు 35 ఘటనలు జరిగాయి. అంటే గత ఏడేళ్లలో 45 శాతం ఘటనలో ఈ ఏడాదిలోనే జరిగాయన్న మాట.

2014 తర్వాతే గో రక్షణ పేరిట దాడులు
2010, 2011ల్లో గోవులకు సంబంధించిన హింసాత్మక ఘటన ఒక్కటి కూడా నమోదు కాలేదు. 2012, 2013 సంవత్సరాల్లో ఒక్కో ఘటన చోటు చేసుకున్నది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత గోరక్షకుల ఆగడాలు పెరిగిపోయాయి. ఆ ఏడాది గోవులపేరిట మూడు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. 2015లో 13, 2016లో 25, 2017లో (ఆగస్టు చివరి నాటికి) 35 జరిగాయి. అంటే, గత ఏడేండ్లలో (2010-17) మొత్తం 78 ఘటనలు జరిగితే.. గత మూడేండ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో జరిగినవి 76. మొత్తం దాడుల్లో 52 శాతం బీజేపీ పాలిత రాష్ర్టాల్లో చోటుచేసుకున్నాయి.

బాధితులపైనే పోలీసులు ఇలా కేసుల నమోదు
గోవులకు సంబంధించిన హింసలో అత్యధికంగా వేధింపులకు గురవుతున్నది ముస్లింలే. 2010 నుంచి గోరక్షకుల చేతుల్లో 30 మంది మరణించగా, వారిలో ముస్లింలు 26 మంది. బాధితులపైనే పోలీసుల కేసులు గోరక్షణ పేరిట జరుగుతున్న హింసలో పోలీసులు పలుమార్లు దుండగులపై కాక 46 శాతం మంది బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు. మొత్తం 78 కేసులకు 36 కేసులలో పోలీసులు బాధితులపైనే కేసులు నమోదు చేశారు. గమ్మత్తేమిటంటే ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లోని ఉన్నాలో దళితులను చితకబాదారు. ఉత్తరప్రదేశ్ లో గోమాంసం కలిగి ఉన్నాడని అఖ్లాక్ అనే ముస్లిం ఇంటిపై దాడి చేసి, తీవ్రంగా కొట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

స్మగ్లర్లని అసెంబ్లీలో రాజస్థాన్ సర్కార్ ప్రకటన
ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన జరిగిన పెహ్లూఖాన్ హత్య కేసులో రాజస్థాన్ పోలీసులు ఆరుగురు నిందితులకు ఇటీవల క్లీన్చిట్ ఇవ్వడంపై నిరసన వ్యక్తమవుతున్నది. పెహ్లూఖాన్ తన మరణవాంగ్మూలంలో పేర్కొన్న నిందితులను పోలీసులు నిర్దోషులుగా తేల్చడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజస్థాన్లో బీజేపీ అధికారంలో ఉండటం, నిందితులంతా విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు కావడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. పెహ్లూఖాన్, అతని నలుగురు సహచరులు హర్యానాకు చెందిన పాడి రైతులని మీడియాలో వార్తలు వచ్చినా, వారిని స్మగ్లర్లు అని ఆ రాష్ట్ర హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా అసెంబ్లీలో ప్రకటించారు. ఈ కేసులో పక్షపాతపూరితంగా సాగిన విచారణ, ఉద్దేశపూర్వకమైన జాప్యం, నిందితులను అరెస్టు చేయడంలో నిరాసక్తతపై అప్పట్లోనే 23 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సీఎం వసుంధరా రాజె సింధియాకు ఒక లేఖ రాశారు. గోసంరక్షకులను ఉపేక్షించరాదన్న ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలను సైతం రాజస్థాన్ సర్కార్ బేఖాతరు చేసింది. గో సంరక్షకులకు కళ్లెం వేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా వసుంధర ప్రభుత్వం పట్టించుకోలేదు.

అనుమతి పత్రాలు ఉన్నా దాడులు
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ర్టాలలో రాత్రివేళ కొందరు ప్రైవేట్ వ్యక్తులు ట్రక్కులను తనిఖీ చేయడంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గోరక్షకులుగా చెప్పుకొంటున్న కొందరు యువకులు జాతీయ రహదారులపై వచ్చిపోయే వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారని, ఆపకుండా తమను దాటి వెళ్లిన ట్రక్కులను వెంటాడుతూ డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ వాహనంలోనైనా గోవులు, గేదెలు కనిపిస్తే వారివద్ద అనుమతి పత్రాలు ఉన్నాసరే ముందుగా డ్రైవర్ను, వాహనంలో ఉన్న వ్యక్తులను చితకబాదుతున్న ఘటనలు ఇటీవల నిత్యకృత్యమయ్యాయి.












Click it and Unblock the Notifications