విభజన ఎఫెక్ట్: ఏపీ, తెలంగాణల మధ్య బాగా తగ్గింది..!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు ప్రయాణీకుల సంఖ్య బాగా తగ్గిందట. ఈ విషయాన్ని స్వయంగా రైల్వే శాఖ వెల్లడించింది. రాష్ట్ర విభజన అనంతరం జూన్ 2014 నుంచి అక్టోబర్ 2014 మధ్య ఏకంగా 60 లక్షల మంది ప్రయాణికులు తగ్గారట.
ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో బస్సుల బంద్ కారణంగా 70 లక్షల మంది ప్రయాణీకులు రైళ్లల్లో తమ గమ్య స్ధానాలకు చేరుకోగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత వీరంతా తిరిగి రోడ్డు మార్గాన్నే ఎంచుకున్నారని పేర్కొంది.
ఈ గణాంకాలన్నీ ఇటీవల రైల్వే శాఖకు సంబంధించిన స్థాయీ సంఘం లోక్సభకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. అయితే చాలా మంది ఏపీ విభజన అనంతరం సామాన్యుల జీవితాల్లో పెద్దగా మార్పులేమీ జరగలేదని అనుకుంటున్నారు.
కానీ తెలియకుండానే, వాటంతటవే జరిగిపోతున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జంట నగరాల్లో సుమారు 5 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయ్యాయని తెలుస్తోంది.