రేప్ బాధితులపై 'టు ఫింగర్ టెస్ట్'కు ఇక స్వస్తి
న్యూఢిల్లీ: రేప్ బాధితులపై నిర్వహించే ఫింగర్ టెస్టును ఢిల్లీ ప్రభుత్వం నిషేధించనుందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. దీనికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేయనుందని ఆయన తెలిపారు.
అంతక ముందు రేప్ బాధితులపై ఫింగర్ టెస్టును నిషేధించలేదని తెలుపుతూ జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వును కూడా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఈ విధంగా ఉత్తర్వు జారీ చేసిన అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
చికిత్స కోసం మినహా రేప్ జరిగిందా లేదా అనే నిర్ధారించేందుకు నిర్వహించే ఫింగర్ టెస్టుని ప్రభుత్వం నిషేధిస్తుందని ఆయన తెలిపారు. అత్యాచార నిర్ధారణ కోసం అవసరమైతే బాధితులపై 'టు ఫింగర్ టెస్ట్'గా పేర్కొనే పర్ వాజినల్ (పీవీ) పరీక్ష జరిపించడానికి అనుమతించినట్లు మే 31న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు హెల్త్ డిపార్ట్మెంట్ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ మార్గదర్శకాల్లో బాధితురాలి అనుమతితో పరీక్ష జరపించవచ్చని పేర్కొంది. బాధితురాలిని లైంగికంగా నిర్ధారించడం కోసం ఈ టు ఫింగర్ టెస్టుని నిర్వహిస్తున్నారు. అయితే బాధితురాలిపై ఈ టెస్టు జరిపించడం అత్యంత దురదుష్టకరమని, ఆమెను గౌరవాన్ని కించపరచడమేనని ఇటీవల కాలంలో కొన్ని ఎన్జీఓలు ఈ పరీక్షను నిషేధించాలని డిమాండ్ చేశాయి.
దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టు కూడా ఈ పరీక్ష నిర్వహించడం బాధితుల వ్యక్తిగత జీవితంలో తలదూర్చడమేనని, రేప్ నిర్ధారణకు మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించాలని కోరుతూ ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం టు ఫింగర్ టెస్ట్ పరీక్షను ప్రభుత్వం నిషేధించలేదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది.
దీనిపై ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఈ ఉత్తర్వుని ఆప్ ప్రభుత్వం నిషేధించనుందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.