నేడు రంజాన్: మరింత అందంగా హైదరాబాద్ (ఫోటోలు)
హైదరాబాద్: నెలరోజుల ఉపవాస దీక్షల అనంతరం ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలు, ఆనందోత్సహాలతో జరుపుకునే ఈదుల్-ఫిత్ (రంజాన్) పండుగను రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు గురువారం జరుపుకుంటున్నారు. ప్రార్ధనలకు సమస్యలు రాకుండా ఉండేందుకు రాష్ట్రంలోని ప్రధానమైన ఈద్గాలతో పాటు జిల్లా కేంద్రాల్లోని ఈద్గాల వద్ద తెలంగాణ వక్ఫ్బోర్డు, స్థానిక మసీదు కమిటీల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
గురువారం ఉదయం 7 గంటల నుంచి 10.30 మధ్య ఆయా ప్రాంతాల్లోని ఈద్గాలలో ఈద్ నమాజ్ జరుగుతుంది. దాదాపు నాలుగు లక్షల మందికిపైగా పాల్గొనే హైదరాబాద్లోని చరిత్రాత్మక మీరాలం ఈద్గాలో ఉదయం 9.30 గంటలకు ఈదుల్-ఫిత్ నమాజ్ జరుగుతుందని వక్ఫ్బోర్డు అధికారులు తెలిపారు.
రంజాన్ పర్వదినం సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు గురువారం సెలవు ప్రకటించింది. గతంలో జూలై 6 వ తేదీన సెలవుగా ప్రకటించినప్పటికీ రంజాన్ తేదీ మారడంతో హైకోర్టుతోపాటు రాష్ట్రంలోని అన్ని దిగువ కోర్టులు, మధ్యవర్తిత్వ కేంద్రాలు, ట్రిబ్యునళ్లకు 7వ తేదీన గురువారం సెలవు దినంగా ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఇప్పటికే హైకోర్టుకు ప్రత్యేక సెలవుగా పేర్కొన్న అక్టోబర్ 31వ తేదీన(సోమవారం) హైకోర్టు పనిచేస్తుందన్నారు. మరోవైపు రంజాన్ మాసం సందర్భంగా నగరంలోని పాతబస్తీలోని చార్మివద్ద నిర్వహించిన నైట్ బజార్ నేటితో ముగియనుంది. దీనికి సంబంధించిన చిత్రాలు మీకోసం...
నేడు రంజాన్: మరింత అందంగా హైదరాబాద్
పబ్లిక్గార్డెన్లోని షాహీ మసీదులో ఉదయం 9.30కి, సనత్నగర్ ఈద్గాలో ఉదయం 9.00కి, హజ్రత్ ఉజాలేషా ఈద్గాలో ఉదయం 9.00కి, హుమాయున్నగర్లోని మిలిటరీ పరేడ్గ్రౌండ్లో ఉదయం 9.30కి, కంటోన్మెంట్ కార్ఖానా ఈద్గాలో ఉదయం 9.30కి, ఈద్గా కుతుబ్షాహి టూంబ్స్లో ఉదయం 9.45కి, అంబర్పేట ఈద్గాలో 10.00కి, చరిత్రాత్మక మక్కామసీదులో ఉదయం 10 గంటలకు ఈద్ నమాజ్ జరుగుతుందని వక్ఫ్బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.
నేడు రంజాన్: మరింత అందంగా హైదరాబాద్
రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజులపాటు జరిపే ప్రార్థనలు, దైవాశీస్సులు, క్షమార్పణల సమాహారమే రంజాన్ పర్వదినమని ప్రణబ్ తన రంజాన్ సందేశంలో పేర్కొన్నారు.
నేడు రంజాన్: మరింత అందంగా హైదరాబాద్
ఈ సందర్భంగా మనమంతా మానవాళి సేవకు పునరంకితం కావాలని, మన సంతోషాన్ని పేదలతో, ఆర్తులతో పంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని దేశ ప్రజలతోపాటుగా పలుదేశాల అధినేతలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ శాంతి సామరస్యాల స్ఫూర్తిని మరింతగా పెంచాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.
నేడు రంజాన్: మరింత అందంగా హైదరాబాద్
పాక్ ప్రధాని నవాజ్షరీఫ్తో సహా పలువురు ముస్లిం దేశాల నేతలు, పాలకులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సౌదీరాజు సల్మాన్, అబూధాబీ యువరాజు అల్నహయాన్, ఖతార్ అమీర్ థానీ తదితరులకు పండుగ గ్రీటింగ్స్ చెప్పినట్టు మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు.
నేడు రంజాన్: మరింత అందంగా హైదరాబాద్
రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. పరిశుద్ధమైన ఖురాన్ బోధనలు ప్రపంచ మానవాళికి సరికొత్త దిశానిర్దేశం చేశాయన్నారు. నిష్ఠతో కూడిన స్వీయ నియంత్రణ ద్వారానే జీవితం దేవుడి మార్గంలో నడుస్తుందని పవిత్రమైన రంజాన్ పండుగ మనకు గుర్తు చేస్తుందని గవర్నర్ అన్నారు.
నేడు రంజాన్: మరింత అందంగా హైదరాబాద్
ముస్లిం సోదరులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడికి అతి సమీపంగా చేరుకోవడానికి ముస్లింసోదరులు జరుపుకునే పండుగే ఈదుల్ఫితర్ అన్నారు. రంజాన్ నెలరోజుల ఉపవాసం, ప్రార్థనల ద్వారా మన శరీరాన్ని, ఆత్మను శుద్ధిచేయడంతోపాటు మనస్సును నియంత్రణ చేస్తుందన్నారు. ముస్లిం సోదరులతో కలిసి తెలంగాణ ప్రభుత్వం కూడా ఈదుల్ఫితర్ పండుగను జరుపుకుంటున్నదన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు బంగారు తెలంగాణ కోసం ప్రార్థనలు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు.