చైనాలో ఇంత దారుణమా?: దిగ్భ్రాంతి కలిగించే కథనం.. అసలేం జరుగుతోంది?
Recommended Video

బీజింగ్: రాజకీయ ఖైదీల పట్ల చైనా అమానుష వైఖరి ప్రపంచ దేశాలను విస్మయపరుస్తోంది. బతికుండగానే వారి నుంచి నిర్దాక్షిణ్యంగా అవయవాలను వేరు చేసి.. డిమాండ్పై సప్లై చేస్తున్నారు. ఫలూన్ గాంగ్ అనే ఒక శాంతియుత సంస్థకు చెందిన ఖైదీలే ఇందులో ఎక్కువగా బలైపోతున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన ఇంత యథేచ్చగా జరుగుతున్నా.. చైనా ప్రభుత్వాన్ని ఎదిరించడానికి సాహసిస్తున్నవారు అతికొద్దిమంది మాత్రమే.

ఓ డాక్టర్ స్పందన:
కొన్ని వేలమంది రాజకీయ ఖైదీల నుంచి అవయవాలను వేరు చేసిన ఎన్వార్ థోటీ అనే ఓ డాక్టర్ ఇటీవల దీనిపై స్పందించారు. 'ఓరోజు ఆపరేషన్ థియేటర్ గదిలోకి ఓ సాయుధుడు వచ్చాడు. మేం బయట నిలబడ్డాం. గది నుంచి తుపాకీ పేలిన చప్పుడు. లోపలికి రమ్మని సైగ చేయగానే వెళ్లాం. గుండెపై బుల్లెట్ గాయంతో ఖైదీ విలవిల్లాడుతూ కిందపడి ఉండటం చూశాం.
అతని 'కిడ్నీ, లివర్' తీయండి.. అని ఆ సాయుధుడి నుంచి ఆదేశం. అప్పటికీ ఆ ఖైదీ కదులుతున్నాడు. మనసు చివుక్కుమన్నా తప్పలేదు. అతని శరీరం నుంచి అవయవాలు బయటకు తీశాం. అలాంటివి కొన్ని వేలసార్లు చేయాల్సి వచ్చింది.' అని చెప్పుకొచ్చారు.

2006లో వెలుగులోకి..:
1990 నుంచి చైనాలో సాగుతున్న ఈ మారణ హోమం 2006 దాకా వెలుగులోకి రాలేదు. అంతలా చైనా ప్రభుత్వం అక్కడి మీడియాను, హక్కుల సంస్థలను నియంత్రించింది. 'ఫలూన్ గాంగ్'ను తొలుత ప్రోత్సహించిన చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వమే.. ఆ తర్వాత వారి పట్ల నిర్దయగా వ్యవహరిస్తూ వచ్చింది. ఫలూన్గాంగ్తో తమకు ప్రమాదం ఉందని భావించి దానిపై నిషేధం విధించింది.

ఎవరీ ఫలూన్ గాంగ్:
ఫలూన్ గాంగ్ అంటే ఒక వర్గం బౌద్దులే. వీరు క్విగాంగ్ అనే ఒక రకమైన నృత్యం, యోగా వంటివి సాధన చేస్తుంటారు. శాంతియుత జీవనాన్ని కొనసాగించే ఈ ఆధ్యాత్మిక మార్గానికి 1992లో లీహోంగ్జీ అనే వ్యక్తి తొలుత బీజం వేశాడు. ఆధ్యాత్మిక ఉద్యమంలా మొదలైన ఇందులో.. దాదాపు 7కోట్ల మంది ప్రజలు చేరారు.

10వేల మందిని అరెస్ట్ చేయించి..:
రోజురోజుకు ఫలూన్ గాంగ్ పరిధి విస్తరిస్తుండటంతో చైనా కమ్యూనిస్ట్ నాయకత్వం ఉలిక్కిపడింది. ఫలూన్ గాంగ్ బలం పెరిగితే.. అది ప్రభుత్వానికి కూడా ప్రమాదమని భావించి దానిపై నిషేధం విధించింది. దీనికి వ్యతిరేకంగా 1999లో 10వేల మంది నిరసనకారులు ఆందోళన నిర్వహించగా.. వారందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించింది. అలా అరెస్టయి జైళ్లలో మగ్గుతున్నవారి నుంచే బలవంతంగా అవయవాలను తీయిస్తోంది. డిమాండ్ మేరకు ఆయా వైద్య సంస్థలకు, దేశాలకు వాటిని సరఫరా చేస్తోంది.

అవయవాలు తొలగించి 2009లో 2వేల మంది..:
2009 వరకు అధికారిక లెక్కల ప్రకారం చైనా జైళ్లలో 2వేల మందికి పైగా ఖైదీలు కస్టడీలో మృతి చెందారు. అయితే అవయవాలను విక్రయించడానికే వీరిని హతమార్చారన్న ఆరోపణలున్నాయి. అవయవాలను తొలగించడానికి ముందు.. ఆ ఖైదీల చేత రోజుకు 16గంటల పాటు కఠినంగా పనిచేయిస్తారు. ఆ తర్వాత రక్త పరీక్షలు నిర్వహించి.. దాని ఆధారంగా అవయవాలను వర్గీకరిస్తారు. అనంతరం అవయవాలను శరీరం నుంచి వేరు చేసి సరఫరా చేస్తారు.

ఇతర దేశాల నుంచి కూడా:
చైనాలో ఇప్పటికీ ప్రతీరోజూ `160మంది ఖైదీలను అవయవాల కోసం హతమారుస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో చైనాలో అవయవ మార్పిడులు జరుగుతున్నాయి. చాలా దేశాల్లో ఈ ప్రక్రియకు కొన్ని నెలల సమయం పడుతుంటే.. చైనాలో మాత్రం ఏటా లక్ష వరకు అవయవ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి.
చైనాలో ఇలాంటి ఆపరేషన్లు త్వరగా పూర్తవతుండటంతో.. విదేశీయులు సైతం ఇక్కడికి క్యూ కడుతున్నారు. విదేశాల్లోనూ ఆరోగ్య భీమా వర్తించే సదుపాయం కలిగినవారు.. నేరుగా చైనా వచ్చి అవయవ మార్పిడి చేయించుకుని వెళ్తున్నారు.

ఇవీ రేట్లు:
ఖైదీల నుంచి అవయవాలను తొలగించి వాటిని విక్రయిస్తుండటం ద్వారా చైనా ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరుస్తోంది. అక్కడి ఓ ఆసుపత్రిలో ఉంచిన ధరల పట్టికలో అవయవాల రేటు ఈవిధంగా ఉంది.
కిడ్నీ-62,000యూఎస్ డాలర్స్, లివర్-98000యూఎస్ డాలర్స్, లివర్-కిడ్నీ-160000-180000,ఊపరితితుత్తులు-150,000-170000యూఎస్ డాలర్స్, గుండె-130,000-160,000యూఎస్ డాలర్స్.












Click it and Unblock the Notifications