గుండెను పిండేసే లేఖ: 30ఏళ్ల అనుబంధాన్ని అలా తెంచేసుకుని!, బతుకు పోరాటంలో..
దుబాయ్తో తన 30ఏళ్ల అనుబంధాన్ని తెంచేసుకోవడానికి ఎంతగానో మదనపడ్డ ఆమె.. మాతృభూమి విలువను గుర్తించి తిరిగి స్వదేశంలో అడుగుపెట్టబోతున్నారు.
దుబాయ్: కన్నభూమిని వదిలి పరాయిగడ్డ మీద అడుగుపెట్టాక.. ఆ నేలతో ఎంత అనుబంధం పెంచుకున్నా.. ఏదో ఒకనాడు దానికి వీడ్కోలు పలకక తప్పదు. ఏళ్ల నాటి అనుబంధాన్ని ఒక్కరోజుతో తెంచేసుకోవడం కష్టమే అయినా.. కష్టకాలంలో తిరిగి అక్కున చేర్చుకునేది మాతృభూమే అని గ్రహించినవాళ్లు.. తమ పురా అస్తిత్వాన్ని వెతుక్కుంటూ మళ్లీ స్వదేశంలో కాలుమోపుతారు.
దుబాయ్లో స్థిరపడ్డ సంగీత భాస్కరన్ అనే మహిళ కథే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. దుబాయ్ తో తన 30ఏళ్ల అనుబంధాన్ని తెంచేసుకోవడానికి ఎంతగానో మదనపడ్డ ఆమె.. మాతృభూమి విలువను గుర్తించి తిరిగి స్వదేశంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రాసిన ఓ లేఖ చాలామందిని చలింపజేసేదిగా వైరల్ అయింది. ఆ లేఖ సారాంశం.. ఆమె మాటల్లోనే..
కర్ణాటక టూ దుబాయ్:
'దుబాయికి వలస వెళ్లిన మొదటి తరం భారతీయుల్లో మా నాన్న కూడా ఒకరు. కర్ణాటకలోని బెంగళూరు మా స్వస్థలం. జేబులో ఒక్క రూపాయి కూడా లేకుండా దుబాయికి వచ్చిన ఆయన.. ఓ కంపెనీలో కార్మికుడిగా చేరాడు. పైసా పైసా కూడబెట్టి అప్పులన్నీ తీర్చేశాడు. ఆ తర్వాత కొంత డబ్బు కూడబెట్టుకుని నన్ను, నా చెల్లిని, మా అమ్మను కూడా దుబాయికి రప్పించాడు. దుబాయికి వచ్చినప్పుడు నేను చాలా చిన్నపిల్లను.
నా బాల్యం అంతా ఇక్కడే గడిచింది. నా తీపిగుర్తులన్నీ ఇక్కడే ఉన్నాయి. నా జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలకు దుబాయి నిలయం. నింగినంటే బుర్జ్ఖలీఫా, అహ్లాదకరమైన థీమ్ పార్కులు, బీచ్.. అక్కడ దొరికే స్వీట్ టీ.. ఇవన్నీ నాకు చాలా చాలా ఇష్టం. అవన్నీ నా జీవితంలో భాగమైపోయాయి. ఈ దుబాయిలోనే పెరిగి పెద్దయ్యాను. '
సాఫీ జర్నీలో పెద్ద కుదుపు:
'ప్రస్తుతం దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న నాకు.. అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో ఊహించని షాక్ తగిలింది. సరిగ్గా 2012వ సంవత్సరంలో మా నాన్నకు కంపెనీ ఓ లేఖ ఇచ్చింది. అప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి వెంటనే రమ్మన్నాడు. నాన్న ఫోన్ చేసి అర్జెంట్ అనడంతో ఆఫీసుకు సెలవు పెట్టేసి మరీ ఇంటికి చేరుకున్నా. అప్పటికే ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లి ఉన్నారు.
అందరూ విషాదంలో ఉన్నట్లు అనిపించింది. ఆయన ఎదురుగా కుర్చీలో కూర్చున్నాను. నా చేతిలో ఓ కాగితం పెట్టి చదవమన్నారాయన. నేను దాన్ని తెరచి చదవడం ప్రారంభించాను. ఆ లేఖలోని ఒక్కో వాఖ్యాన్ని చదువుతోంటే నా కళ్ల వెంట నీళ్లు ఆగలేదు. గుండెను ఎవరో పిండేసినట్లు అనిపించింది.'
లేఖలో ఏముంది?:
'నీ సేవలు ఇక మా కంపెనీకి అవసరం లేదు. నిన్ను ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నాం. 30 ఏళ్లకు పైగా మా సంస్థకు సేవలు అందించినందుకు కృతజ్ఞతలు. త్వరలోనే రాజీనామా పత్రాన్ని సమర్పించగలరు. లేకుంటే గడువు ముగిశాక మేమే ఉద్యోగం నుంచి తొలగించాల్సి ఉంటుంది. దయచేసి గమనించగలరు.
దాన్ని చదివిన నాకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. సంస్థకు ఓ బానిసలా.. పనిచేశారాయన. నిత్యం కంపెనీ, పని అంటూ కలవరించేవాడు. మా కంటే ఎక్కువ సమయం కంపెనీలోనే గడిపాడు. వృత్తిలో నిబద్ధతతో వ్యవహరించారు. అయినా ఏ కారణం లేకుండానే, పనిచేయగల సామర్థ్యం ఉన్నా ఆయనను ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నారు.'
ముసిరిన ఆలోచనలు:
'నాన్న ఉద్యోగానికి రాజీనామా చేసి.. నన్ను నామినీగా పెట్టుకుని తన వర్క్ వీసాను పేరెంట్ వీసాగా మార్చుకున్నారు.30 ఏళ్ల క్రితం ఇండియా నుంచి వలస వచ్చి ఎన్నో ఎత్తయిన కట్టడాలు కట్టిన శ్రామికుల్లో ఒకరైన మా నాన్నకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది. దుబాయిలో ఎన్నేళ్లు ఉన్నా ఇంతేనా..? దుబాయి అభివృద్ధిలో భాగం అయిన మాకు, మాలాంటి వారికి ఇక్కడ ఉండే అర్హత లేదా? అన్న ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరిచేశాయి'
ఇలాంటి పరిస్థితి రాకూడదని:
'ఆ ఆలోచనల్లో నుంచే నేనో నిర్ణయానికి వచ్చాను. మా నాన్న లాంటి పరిస్థితి నాకూ, నా పిల్లలకు రాకూడదని నిర్ణయించుకున్నాను. ఎన్నేళ్లున్నా వలస వ్యక్తులగానే బతికి.. వాళ్లు వెళ్లగొట్టగానే మళ్లీ బతుకుదెరువు కోసం వెతుక్కునే అవసరం రాకూడదనుకున్నాను. అందుకే నా దేశం.. నా భారత దేశానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నా. చాలా చాలా మథనపడి.. చివరకు ఇదే తుది నిర్ణయమనుకున్నా.
నా కుటుంబ సభ్యులకు నా నిర్ణయాన్ని చెప్పి వాళ్లను కూడా ఒప్పించా. ఎట్టకేలకు ఈ యేడాది జూలై 23వ తారీఖున దుబాయిని శాశ్వతంగా వదిలేసి భారత్కు వచ్చే విమానం ఎక్కా.. ఓ వైపు ఎన్నో తీపి జ్ఞాపకాలకు నెలవైన దుబాయి నగరం.. మరో వైపు భవిష్యత్తుపై నీలినీడలు. మొత్తానికి గుండెను రాయి చేసుకుని దుబాయి నగరానికి వీడ్కోలు చెప్పేశా. అప్పుడనిపించింది. నా మనసులోని భావాలను అందరికీ తెలియజేయాలని.. అందుకే ఈ లేఖ రాస్తున్నా' అంటూ సంగీతా భాస్కరన్ తన వలస జీవితం గురించి వ్యథాభరితమైన లేఖ రాశారు.
ఇప్పుడీ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. చాలామంది ఈ లేఖను చూసి చలించిపోయారు. దుబాయి ప్రవాస జీవితం గడుపుతున్నవారిని మరోసారి ఆలోచనలో పడేసేలా చేసిందీ లేఖ.