మెట్రో కబుర్లు: అమీర్పేట్ టు మియాపూర్.. జస్ట్ 20 నిమిషాలే, ప్రయాణికులకు నిబంధనలివీ...
అమీర్పేట్-మియాపూర్ మార్గంలో మామూలుగా వాహనాల్లో వెళితే గంట పడుతుంది. ఇక ట్రాఫిక్ బాగా ఉండే ఉదయం, రాత్రి వేళల్లో అయితే ఒక్కోసారి రెండు గంటలు కూడా పడుతుంది.
హైదరాబాద్: మెట్రో రైల్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. మరో 6 రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మియాపూర్లో.. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభం కానుంది.
అమెరికా మెట్రో రైల్లో మన తెలుగమ్మాయి! ఓ పుస్తకంతో వెలుగులోకి...
నగరంలో బాగా రద్దీ ఉండే మార్గాల్లో అమీర్పేట-మియాపూర్ ఒకటి. మైత్రివనం మొదలుకుని జేఎన్టీయూ వరకు ఈ రోడ్డు నిత్యం కిటకిటలాడుతుంటుంది. మెట్రో రైల్ ప్రారంభంతో ఈ మార్గంలో ప్రయాణించే వారికి ఎంతో వెసులుబాటు కలగనుంది.
సాధారణంగా అయితే గంట ప్రయాణం...
సాధారణంగా హైదరాబాద్ నగర రోడ్లపై వాహనాలు ట్రాఫిక్ లేకుంటే.. గంటకు 60 కిలోమీటర్లు, ట్రాఫిక్ ఉంటే 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. కానీ వాస్తవంలో వాహనాలు గంటకు 12 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించగలుగుతున్నాయి. ఇది జేఎన్టీయూ ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్న మాట. ఇక అమీర్పేట్-మియాపూర్ మార్గం విషయానికొస్తే.. వాహనాల్లో ప్రయాణానికి కనీసం గంట పడుతోంది. ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే రెండు గంటలు పట్టినా ఆశ్చర్యం లేదు. అడుగడుగునా అంతరాయాలతో ఈ మార్గంలో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. ట్రాఫిక్, రోడ్లపైనే నిలిపే ఆటోలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తప్పించుకుని గమ్యం చేరుకోవడానికి నరకం కనిపిస్తోంది.
మెట్రో రైల్ లో 20 నిమిషాల్లోనే...
మరో ఆరు రోజుల్లో మెట్రో రైల్ ప్రారంభం కానుంది. తొలుత అమీర్పేట్-మియాపూర్ మార్గంలోనై రైళ్లు నడుస్తాయి. అమీర్పేట్ లో మెట్రో రైల్ ఎక్కితే సరిగ్గా 20 నిమిషాల్లో మియాపూర్ స్టేషన్ కు రైలు చేరుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 13 కిలోమీటర్లు. ఈ మార్గంలో మొత్తం 11 స్టేషన్లు ఉంటాయి. అమీర్పేట్, ఎస్సార్ నగర్, ఈఎస్ఐ, ఎర్రగడ్డ, భరత్నగర్, మూసాపేట్, బాలానగర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, జేఎన్టీయూ, మియాపూర్. స్టేషన్కు స్టేషన్కు మధ్య దూరం.. అర కిలోమీటరు నుంచి ఒకటిన్నర కిలోమీటరు ఉంటుంది. ఈ ఒకటిన్నర కిలోమీటరు దూరం ప్రయాణానికి పట్టే సమయం ఒకటిన్నర నిమిషం. అంటే అమీర్పేట్ స్టేషన్ లో మెట్రో ఎక్కితే కాస్త అటూ ఇటుగా 20 నిమిషాల్లో మియాపూర్ స్టేషన్ లో దిగొచ్చన్నమాట.
ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలు...
మెట్రో స్టేషన్ల వద్ద, రైలు ఎక్కాక ప్రయాణికులు ఎలా మసులుకోవాలో ఎల్అండ్టీ హెచ్ఎంఆర్ కొన్ని నిబంధనలతో కూడిన జాబితా విడుదల చేశాయి. ప్రయాణికుల సౌకర్యం, భద్రతా దృష్ట్యా వీటి అందరూ పాటించాలని సంస్థ ఎండీ శివానంద్ నింబర్గి ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు సైకిల్ ట్రాక్ ల ఏర్పాటు ఇంకా జరగలేదు. పాక్షికంగా సైకిల్ స్టేషన్లు వస్తున్నాయి. పాదచారుల మార్గాలు కొంత వరకే ఉన్నాయి. వాటికి మధ్యలో అడ్డంకులు ఉన్నాయి. కొత్తగా నిర్మిస్తున్నారు. వేర్వేరు విభాగాల సమన్వయంతో కొన్ని సమస్యలు పరిష్కరించాల్సి ఉంది.
ప్రయాణికులు చేయాల్సినవి...
మెట్రో రైల్ ప్రయాణికులు టికెట్ కౌంటర్లు, టికెట్ వెండింగ్ యంత్రాలు, ఆటోమేటిక్ ఫేర్ గేట్లు వద్ద, మెట్రో దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు వరుస క్రమశిక్షణ పాటించాలి. బేబీ బగ్గీస్, చక్రాల కుర్చీలో వచ్చిన వారు ఫ్లాట్ఫామ్పైకి చేరుకునేందుకు ఎలివేటర్స్ ఉపయోగించాలి. మెట్రోలో ప్రయాణించే వైపు నిలబడాలి. పడిపోకుండా పైన ఉండే హ్యాండ్ రైల్స్ పట్టుకోవాలి. ఆయా స్టేషన్లలో మెట్లు, ఎస్కలేటర్లు ఎక్కేటప్పుడు ముందు వైపు చూస్తూ ఎక్కాలి. ఎడమ వైపు నిలబడాలి. పై అంతస్తు వచ్చే వరకు కదలకుండా ఉండాలి. స్టేషన్, మెట్రోలో అనౌన్సర్ ప్రకటనలను వింటూ ప్రయాణం చేస్తే గమ్యం చేరడం సులువు. ఏ విషయంలోనైనా సందేహం వస్తే విధుల్లోని సిబ్బందిని సంప్రదించాలి. ప్రయాణికుల సేవా కేంద్రానికి వెళ్లి సహకారం తీసుకోవచ్చు. మెట్రో పరిసరాల్లో ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించేవి కనబడితే సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. భద్రతా తనిఖీల సమయంలో సహకరించాలి. తోటి ప్రయాణికులు, మెట్రో సిబ్బందితో గౌరవంగా మెలగాలి. గమ్యం చేరగానే ఎక్కువ సేపు మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఉండకూడదు. పిల్లలు, వృద్ధులు, వికలాంగులు మెట్రో ఎక్కేందుకు సహకరించాలి.
ప్రయాణికులు చేయకూడనవి...
పెంపుడు జంతువులకు మెట్రో పరిసరాల్లోకి ప్రవేశం లేదు. మెట్రో టోకెన్, స్మార్ట్ కార్డును ఎవరిది వారే ఉపయోగించాలి. ఫ్లాట్ఫాంపైన ఉన్న పసుపు రంగు లైను దాటి ముందుకు రాకూడదు. మెట్రో తలుపులు ఆటోమెటిక్గా తెరుచుకుని మూసుకుంటాయి. వాటిని బలవంతంగా తెరిచే, మూసే ప్రయత్నం చేయకూడదు. అలాగే వాటిని ఆనుకుని నిలబడకూడదు. మెట్రో ఎక్కేందుకు తోసుకుంటూ రాకూడదు. పిల్లలు ఉన్నప్పుడు పెద్దలు వారి చేయి పట్టుకోవడం మేలు. ఫ్లాట్ఫాంపైన ఓవర్హెడ్ లైన్లకు సమీపంలోకి వెళ్లకూడదు. అనుమతి లేకుండా ఆయుధాలను తీసుకుని రాకూడదు. వైద్య అత్యవసర, ప్రాణాపాయ ఘటనలు, ఆస్తి నష్టానికి దారితీసే సమయాల్లోనే మెట్రో డ్రైవర్ వద్ద ఉన్న అత్యవసర కమ్యూనికేషన్ను వాడాలి. మెట్రోరైలు పరిసరాల్లో ఉమ్మి వేయకూడదు. అలాగే పొగాకు, పాన్ నమలడం నిషేధం. పొగ తాగరాదు, మద్యపానం చేయరాదు. మెట్రోరైలు పరిసరాల్లో ఫొటోగ్రఫీ కూడా నిషేధం. తమ వస్తువులను మెట్రో పరిసరాల్లో వదిలి వెళ్లకూడదు. మెట్రో స్టేషన్లు, మెట్రోలో కింద కూర్చోకూడదు. ఆహారం, పానీయాలు తీసుకోకూడదు. ప్రమాదకర, పేలుడు పదార్థాలకు అనుమతి లేదు. ఎస్కలేటర్పై కూర్చోకూడదు. మెట్రో పరిసరాల్లో వీధి వ్యాపారులకు అనుమతి లేదు.