భారత్కు జంట సవాళ్లు: పట్టణీకరణ, పౌష్టికాహార లోపం
వచ్చే 13 ఏళ్లలో దారిద్ర్యం, ఆకలి సమస్యలను పూర్తిగా నిర్మూలించాలని రెండేళ్ల క్రితమే ప్రపంచ దేశాలు తీర్మానించుకున్నాయి.
న్యూఢిల్లీ: వచ్చే 13 ఏళ్లలో దారిద్ర్యం, ఆకలి సమస్యలను పూర్తిగా నిర్మూలించాలని రెండేళ్ల క్రితమే ప్రపంచ దేశాలు తీర్మానించుకున్నాయి. కానీ ఆచరణలో సదరు లక్ష్య సాధనలో పట్టణీకరణ కొత్త సవాల్ గా ముందుకు వస్తున్నది. దీనికి తోడు భారత్లో కొందరు పౌష్ఠికాహార లోపంతో బాధపడితే మరి కొందరు అతిగా పౌష్టికామారం తీసుకునే పరిస్థితి నెలకొంది. బరువు పెరగడం చాలా సులభం. కానీ తగ్గడం మాత్రం చాలా కష్టం.
ఇది ఎంతోమంది విషయంలో రుజువైంది. ఇలాంటి విచిత్ర పరిస్థితే వచ్చే పదేళ్లలో మనదేశం ఎదుర్కొనబోతున్నదని 'గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్ - 2017' పేర్కొన్నది. శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణలో అవకాశాలు, సవాళ్లపై ప్రత్యేక ద్రుష్టి సారించాలని, ప్రత్యేకించి స్వల్ప, మధ్య తరగతి ఆదాయ కుటుంబాలు గల దేశాల్లో ఆహార భద్రత, పౌష్టికాహార లభ్యతపైనే ద్రుష్టి పెట్టాలని నివేదిక సూచించింది.
డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆకర్షణీయ నగరాలు, మెట్రో రైళ్లు వంటి పథకాలతో కేంద్ర ప్రభుత్వం దూసుకుపోతోంది. ఫలితంగా వచ్చే పదేళ్లలో దేశ పట్టణ జనాభా అనూహ్యంగా పెరిగే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. అయితే ఇలా పెరిగే పట్టణ జనాభాతో దేశం కొత్త సవాళ్లను ఎదుర్కోనున్నది.

ఇందుకు విభిన్నంగా..
ఒకవైపు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చేయడానికి పనిలేని పరిస్థితులు ఉంటే మరోవైపు అధిక పోషకాహారం కారణంగా అనారోగ్యం పాలవుతున్నవారి సంఖ్య కూడా భారత్లో పెరుగుతోందని గ్లోబల్ సర్వే తెలిపింది. ఇప్పటికే ఐదేళ్లలోపు చిన్నారుల్లో 38.5% మంది అవసరమైన దానికంటే ఎక్కువ బరువు ఉన్నారని, రానున్న పదేళ్లలో వీరిసంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నదని తెలిపింది. మధుమేహం, ఊబకాయం, అధిక బరువు, జీవనశైలిలో శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో అనారోగ్యం బారీన పడేవారి సంఖ్య కూడా పెరుగుతుందని తెలిపింది.
గ్రామీణుల పరిస్థితి దయనీయం
గ్రామీణ ప్రాంతాల ప్రజలంతా పట్టణాలకు వలస రావడంతో ఇక గ్రామాల్లో ఉండేవారి పరిస్థితి దయనీయంగా మారుతుందని, వారికి కనీసస్థాయి పోషకాహరం కూడా అందని దుస్థితి నెలకొంటుందని తెలిపింది.
ఇక పట్టణాల్లోకి వచ్చేవారిలో 17 శాతం మంది మురికివాడల్లోనే నివసించాల్సి వస్తుందని, ఇటువంటి వారికి కూడా సరిపడ స్థాయిలో పోషకాహారం అందే పరిస్థితి ఉండదని తెలిపింది. దాదాపు 78 శాతం మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తారని, చాలీచాలని జీతం, అధిక పనిగంటలు, విశ్రాంతి కూడా తీసుకోలేని పరిస్థితులు, కాలుష్యపూరిత వాతావరణంలో నివసించడం వంటివి పట్టణ జనాభాలో 78 శాతం మందిని తీవ్ర ఇబ్బందులపాలు చేస్తాయని నివేదిక పేర్కొంది.

భారత్లో పౌష్టికాహార కొరత 15.2%..
భారత్లో జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద 99.4 మిలియన్ల కుటుంబాల్లో ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల సబ్సిడీ బియ్యమే ఆధారం. దీనికి తోడు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న బాలలు 11 శాతానికి తక్కువగా ఉంటే భారత్లో మాత్రం 15.2 శాతంగా నమోదైంది.
రెండూ సమస్యలే...
ఆహార కొరతను అధిగమించేందుకు అవకాశమున్నా నివాస వసతులు, మౌలిక వసతుల కొరత వల్ల చాలామంది ఇబ్బంది పడక తప్పదని, ఇది భారతదేశానికి తీవ్రమైన సమస్యగా మారే అవకాశముందని హెచ్చరించింది. మరోవైపు అవసరానికి మించి పోషకాహారం, సుఖమైన జీవన విధానం కారణంగా అనారోగ్య సమస్యలనెదుర్కొనేవారి సంఖ్య కూడా దేశానికి ఇబ్బందికరంగానే మారే పరిస్థితి ఉందని హెచ్చరించింది. ఈ రెండింటి పరిష్కారానికి ఇప్పటి నుంచే ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాల్సిన అవసరముందని సర్వే సంస్థ పేర్కొన్నది.
2001 - 11 మధ్య పట్టణాలకు 3.2 కోట్ల మంది వలస
2011 జన గణన ప్రకారమే 2001 నుంచి 2011 మధ్య భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి 3.2 కోట్ల మంది పట్టణ ప్రాంతాలకు వలస వచ్చారు. 74 లక్షల మంది పని చేసేందుకు గానీ, వ్యాపారం కోసం గానీ తరలితే.. కోటీ నాలుగు లక్షల మంది ఇండ్లకే పరిమితమయ్యారు. 17 శాతం పట్టణ జనాభాలో 6.5 కోట్ల మందికి పైగా మురికి వాడల్లోనే మగ్గుతున్నారు. గత మూడు దశాబ్దాల్లో ఇది రెట్టింపు కంటే ఎక్కువ అని 2015 మార్చి నివేదిక తెలిపింది.
ఢిల్లీ వాసులకు ఫ్యాట్ తో కూడిన స్నాక్స్ 66%
భారత పట్టణాల్లో నివసిస్తున్న వారి ఆహారపు అలవాట్లు విభిన్నంగా ఉంటున్నాయి. దేశ రాజదానిలోని వారంతా రోజూ కొవ్వుతో కూడిన పదార్థాలే స్నాక్స్గా తీసుకుంటారని తేలింది. త్రుణ ధాన్యాలు, కార్బోహైడ్రైట్లు, మాంసక్రుత్తులు తీసుకుంటున్నా పాల ఉత్పత్తులు తక్కువ తింటారు. ఫండ్లు, కూరగాయలు ఎక్కువగా తినే పట్టణ వాసుల్లో విభిన్న పరిస్థితి ఉంది. సంపన్నులు ఎక్కువగా తీసుకుంటే, మురికి వాడల్లో ఉండే వారు చిన్నారులకు షుగరీ స్నాక్స్ ఎక్కువగా పెట్టడంతో బరువు పెరిగిపోతున్నారు.












Click it and Unblock the Notifications