కేసీఆర్ కల నెరవేరడం కష్టమే?: గొర్రెలు దారి తప్పాయి .. ఇవి నిజాలు?
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం పక్క రాష్ట్రాలకూ, దళారీలకు, పశు వైద్యాధికారులకే ఎక్కువగా ఉపయోగపడింది.
హైదరాబాద్: కుల వృత్తులను బలోపేతం చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచన.. క్షేత్రస్థాయి ఆచరణలో మాత్రం దారి తప్పింది.
కుల వృత్తులను నమ్ముకున్నవాళ్ల కంటే దళారీ దందా నడుపుతున్నవాళ్లకే దీని ద్వారా ఎక్కువ ప్రయోజనం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకానికి దళారీలు నిండా తూట్లు పొడిచారు.

గొర్రెల పంపిణీ:
గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గొర్రెలను కొనుగోలు చేస్తుండటంతో.. ఇక్కడి గొర్రెలను పక్క రాష్ట్రాలకు తరలించి, తిరిగి వాటినే తీసుకొచ్చి ఇక్కడ పంపిణీ చేస్తున్నారు.
తద్వారా ఎక్కువ ధరకు గొర్రెల్ని కొనుగోలు చేసినట్లు చూపించి ప్రభుత్వం నుంచి ఎక్కువ డబ్బు లాగుతున్నారు. అందులో నుంచి దళారులు, పశువైద్యులకు భారీగానే ముడుతోంది. నిజామాబాద్ జిల్లాలో థర్డ్ పార్టీ ద్వారా నిఘా పెట్టడంతో అవకతవకలు బట్టబయలై ఏకంగా పశు సంవర్థక శాఖ జేడీనే విధుల నుంచి తప్పించాల్సి వచ్చింది.

రీసైక్లింగ్ దందా:
తెలంగాణలో గొర్రెలు ఎక్కువగా ఉన్నవాళ్లు దళారుల సహాయంతో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు లాంటి ప్రాంతాలకు వాటిని తరలిస్తున్నారు. అక్కడ బోగస్ పెంపకందారులను సృష్టించి.. వాళ్ల ద్వారా ప్రభుత్వానికి గొర్రెలను విక్రయిస్తున్నారు. ఎక్కువ ధరకు వాటిని విక్రయించడంతో భారీ డబ్బు నకిలీ పెంపకందారులు ఖాతాల్లోకి చేరుతోంది. ఇలా రీసైక్లింగ్ దందా జోరుగా నడిపిస్తున్నారు.

గ్రామ సొసైటీలు, పశువైద్యులు:
తాము తరలించిన గొర్రెలను కొని పెట్టినందుకు గాను గ్రామ సొసైటీలకు కూడా భారీగానే డబ్బు ముట్టుతున్నట్లు తెలుస్తోంది. తల్లి పాలు తాగే పిల్లల్ని, చూడి అవకాశం లేని ముసలి గొర్రెలను కూడా కొనుగోలుకు అనుమతిస్తూ పశువైద్యులు సైతం భారీగానే దండుకుంటున్నారు. దళారుల నుంచి భారీ కమీషన్ అందుతుండటంతో నిబంధనలకు విరుద్దంగా ఉన్న గొర్రెల కొనుగోలుకు అనుమతిస్తున్నారు.

తెగనమ్ముకుంటున్నవారూ ఎక్కువే:
ఖమ్మం లాంటి జిల్లాల్లో యాదవుల్లో 80 శాతం మంది కులవృత్తిని వదిలేశారు. దానికి బదులు మెరుగైన అవకాశాలుండే ఇతర వృత్తుల్లో వారు స్థిరపడ్డారు. దీంతో ప్రభుత్వం సెంటిమెంటుగా ఇస్తున్న గొర్రెలు వారికి బరువుగా మారాయి. దాంతో వాటిని బంధువులకు ఇచ్చేయడమో, లేక ఎంతో కొంత లాభానికి తెగనమ్మేయడమో చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ అసలు లక్ష్యం పూర్తిగా దెబ్బ తిన్నది.

కేసీఆర్ కల నెరవేరడం కష్టమే:
సీఎం కేసీఆర్ కలలు కన్నట్లుగా.. పంపిణీ చేసిన గొర్రెలు పిల్లల్ని పెట్టి.. లక్షల గొర్రెలు కాస్త కోట్లుగా ఎదిగే వాతావరణం కనబడట్లేదు. తెలంగాణలోని గొర్రెల పెంపకం దారులే.. పక్క రాష్ట్రాలకు తరలించి.. నకిలీ పెంపకందారులతో ప్రభుత్వానికి విక్రయిస్తుండటం ద్వారా.. రాష్ట్రంలోని గొర్రెల సంఖ్య అంతగా పెరిగే సూచనలు కనిపించడం లేదు.

సొమ్ము చేసుకుంటున్నారు?
యూనిట్లో 20 ఆడగొర్రెలు, ఒక మగ గొర్రె ఉండాలి. ఆడ గొర్రె బరువు పాతిక కిలోలు, మగ గొర్రె బరువు 30 కిలోలు ఉండాలి. వయస్సు కనీసం 8 నెలలుండాలి. కానీ, ఈ నిబంధనలేవీ పాటించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో.. తల్లి కాళ్లలో పిల్లల్ని కూడా పెద్ద గొర్రెల కింద లెక్కేసి యూనిట్లో ఐదారు కలిపేసి సొమ్ము చేసుకున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే.. దీన్ని సొమ్ము చేసుకొనే పథకంగానే భావిస్తున్నారు. కాగా వరంగల్ జిల్లాలో తొలి విడత యూనిట్లు ఎక్కువగా పట్టణాలకు వలస పోయిన వారికి, కళాశాల విద్యార్థులకు మంజూరయ్యాయి. 25 వేలు కమిషన్ తీసుకొని యూనిట్ను వేరే వాళ్లకు ఇచ్చేస్తున్నారు.

భూపాలపల్లి, మహబూబాబాద్, సూర్యాపేట:
భూపాలపల్లి జిల్లాలో అసలు చలానా కట్టడానికే ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో తొలివిడతగా 9,687 యూనిట్ల పంపిణీ లక్ష్యంగా పెట్టుకోగా.. పథకం ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకూ 508 యూనిట్లను మాత్రమే పంపిణీ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా గొర్రెల కొనుగోళ్లలో కాళ్లకింద పిల్ల (పాలు మరవని చిన్న పిల్ల) ఉన్న తల్లిగొర్రెను ఒకటిగానే తీసుకుంటారు. కానీ, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ధన్నసరిలో కాళ్ల కింద పిల్లనూ వేరుగా లెక్కగట్టి అంటగట్టే యత్నం చేయడంతో లబ్ధిదారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇక.. సూర్యాపేట జిల్లాలో కొందరు లబ్ధిదారులు అధికారులతో ఒప్పందం చేసుకొని తమ గొర్రెలనే లారీలో పక్క రాష్ట్రానికి తీసుకెళ్లి, మళ్లీ కొనుగోలు చేసిన గొర్రెలుగా తీసుకొస్తున్నారు.

నల్గొండలో ఇదీ పరిస్థితి:
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం గడ్డికొండారం గ్రామంలో 9 మంది యాదవులు తమకు ఇచ్చిన గొర్రెలు బాగా లేవని ఆందోళనకు దిగారు. రెండవ విడుతలో పేర్లు ఉన్నవారు కూడా తమకూ ఇప్పుడే ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో తలా 10 గొర్రెలను పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు.
ఇక, ఈ జిల్లాలో పశువైద్యాధికారులు, దళారులు చేస్తున్న దందా.. గొర్రెల రీసైక్లింగ్. వారు జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గంలో తక్కువ ధరకు కొన్న గొర్రెలనే రైతులకు అంటగడుతున్నారు. వాటిని గుంటూరు ప్రకాశం రైతుల నుంచి ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టిస్తున్నట్లు సమాచారం.

పక్క రాష్ట్రాలకు ఉపయోగపడింది:
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం పక్క రాష్ట్రాలకూ, దళారీలకు, పశు వైద్యాధికారులకే ఎక్కువగా ఉపయోగపడింది. రాష్ట్రంలో గొర్రెల పంపిణీకి పొరుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ గొర్రెలను కొనుగోలు చేయడంతో.. అక్కడి పెంపకందారులు అమాంతం ధర పెంచేశారు. దీంతో వాళ్లు అన్నంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి.
అదే సమయంలో పక్క రాష్ట్రాల్లోను అంతగా గొర్రెలు లేకపోవడంతో.. తెలంగాణలోని గొర్రెల పెంపకందారులే వీటిని అటు తరలించి, గ్రామ సొసైటీల చేత కొనుగోలు చేయిస్తున్నారు. తద్వారా భారీగా డబ్బులు కాజేస్తున్నారు. నల్గొండ, మహబూబ్నగర్, కామారెడ్డి, ఆదిలాబాద్ లాంటి సరిహద్దు జిల్లాల్లో గొర్రెల రీసైక్లింగ్ దందాకు తెర లేచింది. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రీసైక్లింగ్ కోసం పెద్ద ఎత్తున గొర్రెలను ఆంధ్రప్రదేశ్కు తరలిస్తుంటే ఆంధ్రజ్యోతి బట్టబయలు చేసింది.

తలసాని సీరియస్:
నల్గొండ జిల్లాలోని కొంతమంది గొర్రెల పెంపకందారులు.. తమ గొర్రెలను గుంటూరుకు తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. ప్రభుత్వం పక్క రాష్ట్రాల నుంచి గొర్రెలను కొనుగోలు చేస్తుండటంతో.. అక్కడ నకిలీ పెంపకదారులను సృష్టించారు. గొర్రెల ధరలు పెంచి నకిలీ పెంపకందారుల చేత ప్రభుత్వానికి వాటి విక్రయిస్తున్నారు. తద్వారా వారి ఖాతాల్లో జమయ్యే డబ్బు తిరిగి వీరికి చేరుతోంది. ఈ వ్యవహారంపై మంత్రి తలసాని సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications