అసెంబ్లీలో కవిత చీరల బేరం: పద్మా బర్త్ డే (ఫొటోలు)
తెరాస ఎంపి కల్వకుంట్ల కవిత అసెంబ్లీ లాబీలో ఏర్పాటు చేసిన స్టాల్లో చీరెలు కొన్నారు. అదే సమయంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు కూడా జరిగాయి.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ లాబీ హాల్లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల స్టాల్ను సందర్శించారు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు అసెంబ్లీకి వచ్చారు.
ఆమె డిప్యూటీ స్పీకర్, కరీంనగర్ జడ్పీ ఛైర్మన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు బొడిగె శోభ, గీతారెడ్డి, డి.కె అరుణ, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్లను స్టాల్కు తీసుకు వెళ్లారు. మదిని దోచే రంగుల్లో గద్వాల, పోచంపల్లి చీరలను సూచి వారంతా తన్మయులయ్యారు.
పద్మాదేవెందర్ రెడ్డికి ఇష్టమైన చిలకపచ్చ రంగు చీరను ఎంపి కవిత జన్మదిన కానుకగా చీరను బహూకరించారు. అలాగే బొడిగే శోభ, సత్యవతి రాథోడ్, తులా ఉమలకూ చీరలను కొనిచ్చారు. తనతో పాటూ తన మాతృమూర్తి శోభమ్మకూ చీరలను కొనుగోలు చేశారు ఎంపి కవిత.
ఆమె చుట్టూ ఇలా చేరారు...
ఎంపి కవిత అసెంబ్లీకి వచ్చిన విషయం తెలిసి పలువురు ఎమ్మెల్యేలు కవితను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జర్నలిస్టులకూ కవిత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చీరలు కొనుగోలు తర్వాత డెబిట్ కార్డును పిఓఎస్ మిషన్ ద్వారా స్వైపింగ్ చేసి డబ్బు చెల్లించారు.
చెనేత వస్త్రాలు కొనాలని..
చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వారికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని ఎంపీ కవిత అభిప్రాయపడ్డారు. స్పీకర్ ఛాంబర్లో కేక్ కట్ చేయించారు. తరువాత కేక్ తినిపించి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జోగురామన్న, ఎమ్మెల్యేలు బొడిగె శోభ, డీకేఅరుణ, గీతారెడ్డి, రాథోడ్ బాబూరావు, ఆల వెంకటేశ్వర్రెడ్డి, కరీంనగర్ జడ్పీ చైర్మన్ తుల ఉమ, టీఆర్ఎస్ నాయకులు సత్యవతి రాథోడ్, డాక్టర్ సంజయ్కుమార్, శ్రీహరిరావు తదితరులు జన్మదిన వేడుకలలో పాల్గొని డిప్యూటీ స్పీకర్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇలా షాపింగ్ చేశారు..
చేనేత వస్త్రాల స్టాల్లో కవిత, పద్మా దేవేందర్ రెడ్డి, తదితరులు షాపింగ్ చేస్తూ ఏ చీర ఎవరికి ఎలా నప్పుతుందో పరీక్షించుకున్నారు. ఆ చీరెలను ఒక్కొక్కదాన్నే పరిశీలిస్తూ తమ అభిరుచిని ప్రదర్శించారు. వాటిని పరిశీలిస్తూ పెద్ద యెత్తునే షాపింగ్ చేస్తూ కనిపించారు.
పద్మాకు కెసిఆర్ ఆశీర్వాదం.
డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం అసెంబ్లీ ఛాంబర్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆశీర్వాదం పొందారు. స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు హరీశ్రావు, కేటీ రామారావు డిప్యూటీ స్పీకర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.