జస్ట్ 20మినిట్స్.. ముంబై-పుణే: ఇదే గనుక అందుబాటులోకి వస్తే.. దశ తిరిగినట్టే?
న్యూఢిల్లీ: శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలను కలిపే రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు కొత్త ఒప్పందాలు చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికాకు చెందిన వర్జిన్ హైపర్లూప్ వన్ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం గనుక కార్యరూపం దాలిస్తే.. దేశ రవాణా వ్యవస్థ దశ దిశా మరో మలుపు తిరిగినట్టే..

ముంబై-పుణే.. జస్ట్ 20మినిట్స్..:
మహారాష్ట్రంలోని ముంబై-పుణేల మధ్య ప్రస్తుత ప్రయాణ దూరం దాదాపు 3గంటలు. కానీ హైపర్ లూప్ సిస్టమ్ ద్వారా గనుక ప్రయాణిస్తే.. కేవలం 20నిమిషాల్లో ఈ దూరాన్ని చేరుకోవచ్చు. ఈ ఉధ్దేశంతోనే మాగ్నెటిక్ మహారాష్ట్ర సమ్మిట్లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, సీఎం ఫడ్నవీస్, వర్జిన్ ఛైర్మన్ రిచర్డ్ సమక్షంలో తాజా ఒప్పందం జరిగింది.

2021కల్లా అందుబాటులోకి..:
అన్ని అనుకున్నట్టుగా జరిగితే ముంబై-పుణే మధ్య ఈ హైపర్ లూప్ సిస్టమ్ 2021కల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2019లో టెస్ట్ ట్రాక్ నిర్మాణం మొదలుపెడతామని, అది సక్సెస్ అయితే ముంబై-నేవి ముంబై-పుణె ట్రాక్ను పూర్తి చేస్తామని వర్జిన్ ఛైర్మన్ రిచర్డ్ తెలిపారు హైపర్ లూప్ సాధ్యాసాధ్యాలకు సంబంధించి త్వరలోనే బృందాలు పని మొదలుపెడుతాయని, ఆర్నెళ్లలో నివేదిక అందజేస్తాయని చెప్పారు.

అంచనా వ్యయం:
ముంబై-పుణే హైపర్ లూప్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం దాదాపు రూ.20వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఇది గనుక అందుబాటులోకి వస్తే.. గ్రౌండ్ లెవల్ రవాణా మార్గాల్లో ఇదే అత్యంత చౌక ప్రయాణంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.

ప్రయోజనాలు..:
ముంబై-పుణే హైపర్ లూప్ రవాణా సిస్టమ్ వల్ల ప్రతీ సంవత్సరం 150మిలియన్ల మంది ప్రయాణం చేస్తారని అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. కేవలం 20నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉండటంతో 90 మిలియన్ల గంటలు ఆదా చేసే అవకాశం ఉందంటున్నారు.
అదే సమయంలో ప్రమాదాలు కూడా దాదాపుగా ఉండవనే చెబుతున్నారు. అలాగే ప్రతీ సంవత్సరం 1,50,000 టన్నుల గ్రీన్ హౌస్ గ్యాస్లు కూడా ఆదా చేయవచ్చని అంటున్నారు.

ధ్వనివేగంతో దూసుకెళ్లే క్యాప్సూల్స్..:
హైపర్ లూప్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో ఒక క్యాప్సూల్ లాంటి నిర్మాణంలో ప్రయాణికులు ప్రయాణించాల్సి ఉంటుందంటున్నారు. ధ్వని వేగంతో దూసుకెళ్లే సాంకేతికతో ఇది పనిచేస్తుందంటున్నారు.
ఇలాంటి వ్యవస్థ ఏ దేశంలోనూ ఇంతవరకు వాణిజ్యపరంగా అందుబాటులో లేదంటున్నారు. ఇది గనుక అందుబాటులోకి వస్తే.. రాబోయే 30ఏళ్లలో సామాజిక, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా రూ.3.5 లక్షల కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉన్నట్టు వర్జిన్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.












Click it and Unblock the Notifications