వ్యభిచారం: ఉమ్మడి రాష్ట్రానికి రెండో స్థానం
హైదరాబాద్: అత్యధిక వ్యభిచారం కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని పోలీసుల నివేదిక ద్వారా వెల్లడైంది. 2013లో భారతదేశంలో నమోదైన 20శాతం కేసులు ఉమ్మడి రాష్ట్రానివే కావడం గమనార్హం. ఈ వివరాలను నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో డేటా వెల్లడించింది.
కాగా, అత్యధిక వ్యభిచారం కేసులతో తమిళనాడు రాష్ట్రం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ నగరంతోపాటు విజయవాడ, విశాఖపట్నంలలో అత్యధిక సంఖ్యలో వ్యభిచారం కేసులు నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది. భారతదేశంలో మొత్తం 2,541 వ్యభిచార కేసులు నమోదవగా అందులో 549 కేసులతో తమిళనాడు రాష్ట్రం అగ్రస్థానంలో ఉండగా.. 489 కేసులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
ఇప్పటికీ హైదరాబాద్లో తరచూ సెక్స్ రాకెట్ల గుట్టు విప్పుతున్నారు పోలీసులు. నగరంలోని ఉన్నత వర్గాలకు చెందిన వారు, టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్టులు, మోడల్స్ ఇందులో భాగస్వాములవుతున్నారు. ధనవంతులైన వ్యాపారవేత్తలు, సంపన్నులు వారి సేవలను వినియోగించుకుంటున్నారు. హోటళ్లు, రిసార్ట్స్తో వ్యభిచారం చేయిస్తున్నారు.
సెక్స్ రాకెట్ నిర్వాహకులు వారి వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు ఇంటర్నెట్లో వివిధ వెబ్సైట్లలో ప్రకటనలు కూడా ఇవ్వడం గమనార్హం. ఈ విషయాన్ని హైదరాబాద్ వెస్ట్ జోన్ డిసిపి సత్యనారాయణ కూడా అంగీకరించారు. సమగ్ర దర్యాప్తు జరిపి వారి గుట్టురట్టు చేస్తామని ఆయన చెప్పారు.
గత రెండు వారాల్లోనే నాలుగు సెక్స్ రాకెట్లను పోలీసులు ఛేదించారు. 10 మంది మహిళలను కాపాడారు. ఇందులో టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్టులే ఉన్నారు. ముంబైకి ఓ మోడల్ కూడా పట్టుబడింది. విశాఖ, విజయవాడ నగరాల్లో కూడా వ్యభిచారం కేసులు అత్యధికంగా పెరిగిపోయాయి. 2012లో విశాఖలో 19 కేసులు, విజయవాడలో 34 కేసులు నమోదవగా.. అవి 2013లో 34, 50 కేసులకు పెరిగాయి.