ఖాకీ నీడలో వేద నిలయం: తమకే దక్కాలంటున్న దీప, పట్టువిడవని పళనిస్వామి!
జయ మేనకోడలు దీప వర్గం నుంచి, ఇటు శశికళ వర్గం నుంచి ఇబ్బందులు రాకుండా అక్కడ పోలీసులను మోహరించారు.
చెన్నై: దివంగత సీఎం జయలలిత నివాసంలో పోలీసుల పహారా కొనసాగుతోంది. వేద నిలయాన్ని స్మారక కేంద్రం చేయాలని సీఎం పళనిస్వామి తీసుకున్న నిర్ణయానికి.. అటు దీప వర్గం నుంచి, ఇటు శశికళ వర్గం నుంచి ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉండటంతో పెద్ద ఎత్తున అక్కడ పోలీసులను మోహరించారు.
వేదనిలయం వద్ద శశికళ కుటుంబ సభ్యులను లోపలికి వెళ్లకుండా నిషేదాజ్ఞలు జారీ చేశారు. గురువారం రాత్రి స్మారక కేంద్రం ఏర్పాటుపై సీఎం ప్రకటన చేయగానే శుక్రవారం భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. భారీ సంఖ్యలో బారికేడ్లతో పాటు సుమారు 100మంది పోలీసులు బలగాలను మోహరించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఆధీనంలోకి:
శశికళ జైలు పాలయ్యాక ఆమె బంధువు ఇళవరసి కుమారుడు వివేక్ ఆధీనంలో వేద నిలయం ఉంది. ప్రస్తుతం వీరికి సంబంధించినవారెవరూ అక్కడ కనిపించడం లేదు. ఇన్నాళ్లు అక్కడ పనిచేసిన మన్నార్ గుడి పనివాళ్లను పోలీసులు శుక్రవారం పంపిచేశారు.
వేదనిలయం ధర రూ.90కోట్లు:
పోయెస్ గార్డెన్ లోని జయలలిత ఇల్లు వేదనిలయాన్ని ఆమె తల్లి సంధ్య 1967, జులై 15న తన పేరుపై కొనుగోలు చేశారు. 24వేల చదరపు అడుగుల స్థలంలో 21,662చదరపు అడుగుల్లో అప్పట్లో రూ.1.32లక్షలతో భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు దాని విలువ రూ.90కోట్లకు పైమాటే.
కోర్టుకెక్కనున్న దీప:
వేదనిలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న జయలలిత మేనకోడలు దీప.. దీనిపై కోర్టులో కేసు వేయనున్నట్లు గురువారం ప్రకటించారు. దీప సోదరుడు దీపక్ సైతం దీనిపై సీఎంకు లేఖ రాశారు. ఈ ఆస్తి తమకు చెందినదని తెలిపే డాక్యుమెంట్స్ అన్ని తమ వద్ద ఉన్నాయన్నారు.ప్రభుత్వానికి నిజంగా చేతనైతే చట్టపరంగా దాన్ని సొంతం చేసుకోవాలని దీప సవాల్ విసిరారు.
వీలునామాలో ఏముంది:
జయలలిత తల్లి సంధ్య వేద నిలయాన్ని తన కుమారుడు జయకుమార్, కుమార్తె జయలలితల పేరిట వీలునామా రాశారు. దానికి సంబంధించి వీలునామా ప్రస్తుతం దీపక్ వద్ద ఉంది. దీంతో ఒకవేళ చట్టపరంగా దీన్ని స్వాధీనం చేసుకోవాల్సి వస్తే.. దీప-దీపక్ లకు నష్ట పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి సీవీ షణ్ముగం తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించారు.
చిన్నమ్మ వద్దకు దినకరన్:
పరిస్థితులన్ని తమకు ప్రతికూలంగా మారడంతో అన్నాడీఎంకె డిప్యూటీ జనరల్ దినకరన్.. జైల్లో ఉన్న తాత్కాళిక ప్రధాన కార్యర్శి శశికళను కలవడానికి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నాం 12.30గం. సమయంలో ఆయన పరప్పన జైలుకు వెళ్లారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో శశికళ తనకు ఇచ్చిన ఆదేశాలను నెరవేర్చి తీరుతానని భేటీ అనంతరం దికరన్ ప్రకటించినట్లు సమాచారం.