టైం వేస్ట్ వద్దు: మీడియాకు మాల్యా, వెనుక ఎవరున్నారు?
న్యూఢిల్లీ: వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో ఉంటున్న కింగ్ ఫిషర్ యజమాని విజయ్ మాల్యా తాజాగా సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించాడు. యూకేలో మీడియా తన వెంటే పడుతోందని వ్యాఖ్యానించాడు.
నేను మీడియాతో మాట్లాడనని స్పష్టం చేశాడు. నేను మీడియాతో ఎట్టి పరిస్థితుల్లోను మాట్లాడనని, కాబట్టి నా గురించి మీడియా తన శక్తిని వృథా చేసుకోవద్దని హితవు పలికాడు.
ఇదిలా ఉండగా విజయ్ మాల్యా లండన్కు వెలుపలనున్న పల్లెటూర్లోనే గడుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే తనకున్న అవకాశాలపై న్యాయ సలహాలను స్వీకరిస్తున్నట్లు.. ఇందు కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈడీ ద్వారా విజయ్ మాల్యాకు సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే.
మార్చి 18 కల్లా మాల్యాను భారత్కు రప్పించాలని ఈడీ భావిస్తోంది. తానో అంతర్జాతీయ వ్యాపారవేత్తనని, ఎక్కడికీ పారిపోలేదని శుక్రవారం ట్వీట్ చేసిన మాల్యా.. ఎపుడు భారత్కు తిరిగి వస్తారన్న విషయం మాత్రం వెల్లడించలేదు.
మరోవైపు, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాజీ సీఎఫ్ఓ రఘునాథన్ను ఈడీ రెండు రోజులుగా ప్రశ్నిస్తోంది. ఐడిబిఐ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.900 కోట్లను సంస్థ ఎగవేసిన కేసుపై మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం దాదాపు ఎనిమిది గంటల పాటు రఘునాథన్ను ప్రశ్నించారు. శనివారం కూడా విచారణ కొనసాగింది. యునైటెడ్ బ్రూవరీస్ సీఎఫ్ఓ రవి నేడుంగడిని సైతం ఈ కేసులో ఈడీ ప్రశ్నించింది.
రుణాల వెనుక రాజకీయ నేతల ఒత్తిడి?
విజయ్ మాల్యాకు రుణాలు ఇవ్వాలని, గతంలో ఇచ్చిన వాటిని పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులపై రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని సిబిఐ అనుమానిస్తోంది. ఈ దిశగా విచారణ చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది.
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విషయంలో కొందరు నేతలు బ్యాంకు అధికారులను ఒత్తిడి చేశారని గతంలోనే వార్తలు వచ్చాయి. గతంలో కొందరు మంత్రులు ఆయనకు అండగా నిలిచారని కూడా కథనాలు వెలువడ్డాయి. ఇక వీరి పాత్రపై కూపీ లాగుతున్న సిబిఐ, మాల్యా సంస్థకు రుణాలను మంజూరు చేసిన బ్యాంకు అధికారులను ప్రశ్నించాలని నిర్ణయించింది.
ప్రధానంగా ఐడిబిఐ బ్యాంకు పాత రుణాన్ని వసూలు చేసేందుకు ప్రయత్నించకుండా... మరింత లోన్ ఇచ్చిన విషయమై వాస్తవాలను వెలికితీయాలని, అదనపు రుణం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం వెనకున్న అసలు వ్యక్తిని గుర్తించాలని సిబిఐ భావిస్తోంది.
ఉద్యోగులకు వేతనాలు ఇస్తూ.. వారి నుంచి టిడిఎస్ కింద వసూలు చేసిన రూ.111 కోట్లను ఆదాయపు పన్ను శాఖకు కట్టలేనంత ఆర్థిక కష్టాల్లో ఉన్న సంస్థకు ఆడిటర్లుగా వ్యవహరించిన వారిని కూడా ప్రశ్నించాలని సిబిఐ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.