రథయాత్ర
తల్లి తెలంగాణ ఉద్యమ నేత, ప్రముఖ సినీనటి విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రథయాత్ర చేయనున్నారు. అందుకు ఆమె ఇప్పటికే రెండు రథాలను సిద్ధం చేసుకున్నారు. ఆమె నటించిన నాయుడమ్మ సినిమా ఆగస్టు మొదటి వారంలో విడుదల కానుంది. ఆ సినిమా విడుదల, ఆమె రథయాత్ర ఒకేసారి ఉండే అవకాశాలున్నాయి. సాధ్యమైనంత త్వరలో తాను తెలంగాణలోని 450 మండలాల్లో రథయాత్ర చేస్తానని విజయశాంతి అంటున్నారు. ఆమె ఆదివారంనాడు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళికి బోనం సమర్పించారు. ఈ సమయంలో ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెస్లపై నిశితమైన వ్యాఖ్యలు చేశారు. తెరాస తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, తెరాస అగ్రనేతలు కె. చంద్రశేఖరరావు, నరేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని ఆమె అన్నారు. ఈ మాటలన్నప్పుడు నరేంద్ర ఆమె పక్కనే వున్నారు. అంతేకాదు, అనంతరం ఆమె నరేంద్ర కారులోనే వెళ్లిపోయారు.
నాయుడమ్మ సినిమా విడుదలతో తన రథయాత్రకు ఏ విధమైన సంబంధం లేదని ఆమె అంటున్నారు. తెలంగాణ ప్రజల ఇక్కట్లపై రూపొందించిన పాటలను, తన ప్రసంగాలను క్యాసెట్ల రూపంలో ఆమె ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ఉద్యమ వైఫల్యాలపై, సమైక్యవాదుల కుట్రలపై కూడా ఈ క్యాసెట్లు ఉంటాయి. తెలంగాణపై మారుతున్న పరిణామాలను పరిశీలించడానికే తాను ఇంత కాలం నిరీక్షిస్తూ దూరంగా వున్నానని ఆమె చెప్పుకున్నారు. తెలంగాణపై మాట్లాడకపోవడం పట్ల ఆమె చలనచిత్ర పరిశ్రమను కూడా తప్పు పడుతున్నారు. బిజెపిని నమ్మలేమని ఆమె స్పష్టంగానే అంటున్నారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న తర్వాత తెలంగాణ డిమాండ్ తీర్మానాన్ని పక్కన పెట్టినందున బిజెపిని నమ్మలేమని, మరోసారి కూడా అలా చేయదనే నమ్మకమేమీ లేదని ఆమె అన్నారు. రాములమ్మ ఫేమ్ అయిన విజయశాంతి చాలా కాలం బిజెపిలో ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ సాధన కోసం తల్లి తెలంగాణను ఏర్పాటు చేశారు.