చంద్రబాబు ఉత్సాహం
ముఖ్యంగా, ప్రజారాజ్యం, లోకసత్తా పార్టీలు ఘోరంగా దెబ్బ తినడం ఆయనకు ఎక్కువ సంతోషాన్ని కలిగించి ఉంటుంది. ప్రజారాజ్యం ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగా, లోక్ సత్తా పత్తా లేకుండా పోయింది. శాసనసభ, లోకసభ జమిలి ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం వల్ల తమ పార్టీ ఓటమి పాలైందని ఆయన గట్టిగానే నమ్ముతున్నారు. ఆ విషయాన్ని ఆయన సమీక్ష చేసి తేల్చుకున్నారు కూడా. కూకట్ పల్లి శాసనసభ సీటును గెలుచుకున్న జయప్రకాష్ నారాయణ ఆ నియోజకవర్గంలో తన అధిపత్యాన్ని నిలుపుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గంలో తన ఆధిక్యాన్ని కనబరిచింది. దీన్ని బట్టి లోకసత్తాకు ప్రజలు దూరమవుతున్నారని చంద్రబాబు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి, హైదరాబాద్ లో లోకసత్తా ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించారు. కానీ అది నిజం కాదని తేలిపోయింది. లోకసత్తా దెబ్బ తిన్న మేరకు తెలుగుదేశం పార్టీ లాభపడింది.
అలాగే, చిరంజీవి కూడా. చిరంజీవికి విశేష ప్రజాభిమానం ఉంది. అది నటుడిగానే తప్ప రాజకీయ నాయకుడిగా కాదని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మరోసారి తేలిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజారాజ్యం ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది. దీన్ని బట్టి చిరంజీవిని ప్రజలు కాంగ్రెసుకో, తమ పార్టీకో ప్రత్యామ్నాయంగా చూడడం లేదని చంద్రబాబు విశ్వసిస్తున్నారు.ఇదే అభిప్రాయం ఆయన మాటల్లో వ్యక్తమైంది. వచ్చే ఎన్నికల నాటికి తాము మరింతగా పుంజుకుంటామని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఆయన ఇక ముందు వ్యవహరించే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పార్టీ క్యాడర్ లో ఉత్సాహం పెరుగుతుందని ఆయన అనుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల పట్ల నిరాసక్తత ప్రదర్శిస్తూ నాయకులు తిరిగి చురుగ్గా వ్యవహరించే అవకాశం కూడా ఉంది. అలాగే, ఇతర పార్టీల వైపు వెళ్లిన నాయకులు కూడా తిరిగి తెలుగుదేశం వైపు చూడవచ్చు. ఈ ఫలితాలు బహుముఖంగా లాభిస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆయన అత్యుత్సాహంగా ఉన్నారు.