చంద్రబాబు నాయుడుపై చిరంజీవి పైచేయి
పార్టీ వైఖరిని పూర్తిగా మార్చుకుని సమైక్యాంధ్ర ఉద్యమంలోకి దూసుకెళ్లారు. రాయలసీమలో, కోస్తాంధ్రలో పర్యటనలు చేస్తూ వచ్చే ఎన్నికల నాటికి బలమైన నాయకుడిగా ఎదగాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజన దాదాపుగా ఖరారైన విషయం తెలియడంతో ఆయన సీమాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కన్నేశారని అనుకోవచ్చు. సమైక్యాంధ్ర కోసం నిలబడడం ద్వారా ప్రజలు పూర్తిగా తననే ఆదరించేలా చేసుకోవడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. చిరంజీవి కార్యక్రమాలకు ఆదరణ విరివిగానే లభిస్తోంది.
అటు కోస్తాంధ్రలోనూ, ఇటు తెలంగాణలోనూ పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. సీమాంధ్రలో తమ శాసనసభ్యుల ఆందోళనలకు ప్రోత్సహిస్తూ తెలంగాణ నాయకులను కూడా తెలంగాణ అనుకూల వైఖరి వ్యక్తీకరణకు అనుమతిస్తున్నారు. కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలపై విమర్శలు చేయడం ద్వారా తెలంగాణలో తన ఉనికిని కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తెరాస, కాంగ్రెసు పార్టీలు విలీనమవుతాయని అంచనా వేస్తున్న చంద్రబాబు నాయుడు తామే తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఉండేందుకు ఆ పద్ధతిని అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, కోస్తాంధ్ర, రాయలసీమల్లో చిరంజీవి దూసుకుపోతుండడం తెలుగుదేశం పార్టీకి నష్టమే కావచ్చు.
సమైక్యాంధ్రను కోరుకుంటున్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కాంగ్రెసు దెబ్బ తింటుందని చిరంజీవి, చంద్రబాబు కూడా అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ముందే సమైక్యాంధ్ర ఉద్యమంలోకి దూకడం ద్వారా వారి నాయకుడిగా మారేందుకు చిరంజీవి తెలంగాణను వదులుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం తెలంగాణను కూడా వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. దీంతో చిరంజీవి చంద్రబాబుపై సీమాంధ్రలో పైచేయి సాధించే అవకాశం ఉంది.