బెంగళూరులో కేంద్రంగా రిసార్ట్ పాలిటిక్స్?: రంగంలో ట్రబుల్ షూటర్ డీకేశి
ఇంకొక్కరోజే మిగిలివుంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగబోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఈ నెల 4న ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏ రాష్ట్రంలో ే పార్టీ అధికారంలోకి వస్తుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇదివరకే వెల్లడైన నేపథ్యంలో వీటిపైనే అందరి చూపూ నిలిచింది. ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఆయా పార్టీలన్నీ కూడా వరుస సమావేశాలను నిర్వహిస్తోన్నాయి.
ఈ పరిణామాల మధ్య కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అస్సాం చేరుకున్నారు. గువాహటిలో ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయాన్ని సందర్శించారు. తరుణ్ గొగొయ్ తో సమావేశం అయ్యారు. ఓట్ల లెక్కింపు నాడు చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు డీకే. ఓట్ల లెక్కింపునకు ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలను ఇతరుల ప్రలోభాల నుండి రక్షించడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

అస్సాంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఇతరుల కన్ను పడిందని, వారిని రక్షించడానికి, దిశానిర్దేశం చేయడానికి, ఇక్కడి పీసీసీకి సహాయ సహకారాలు అందించడానికి ఇక్కడికి వచ్చానని డీకే శివకుమార్ చెప్పారు. రాజకీయ సంక్షోభాల సమయంలో శాసనసభ్యులను ఫిరాయింపుల నుండి కాపాడటానికి రిసార్ట్ రాజకీయాలు నిర్వహించడంలో డీకే శివకుమార్ దిట్ట. ఈ విషయంలో ట్రబుల్ షూటర్ గా పేరుందాయనకు.
బీజేపీ గానీ ఇతర పార్టీల ప్రలోభాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏకతాటిపై నడిపించగలనని ఈ సందర్భంగా డీకేశి ధీమా వ్యక్తం చేశారు. అస్సాంలో బీజేపీ సునాయాస విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలను కొట్టిపారేశారు. ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయతపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. తమకు అనుకూలంగా ఉన్నా, లేకపోయినా ఏ ఎగ్జిట్ పోల్ను కూడా తాను నమ్మబోనని తేల్చి చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ శాంపిల్ చాలా పరిమితంగా ఉంటుందని, తన లెక్కలు తనకు ఉన్నాయని డీకే శివకుమార్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ కు ఓటు వేశామని చెబితే దాడులు చేస్తారనే భయం అస్సాం ఓటర్లలో ఉందని, ఎవరికి ఓటు వేశారో బహిరంగంగా చెప్పకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ లో కూడా ఇండియా బ్లాక్ అధికారంలో వస్తుందని, కేరళ, తమిళనాడుల్లో కాంగ్రెస్ మిత్రపక్షాల విజయం ఇప్పటికే ఖరారైందని తేల్చి చెప్పారు. కేరళలో యూడీఎఫ్, తమిళనాడులో డీఎంకే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. అస్సాం ఓటర్లు మార్పును కోరుకుంటోన్నారని, వారు కోరుకున్నది వారికి లభిస్తుందని డీకే అన్నారు.












Click it and Unblock the Notifications