వైయస్ జగన్ అంగీకరిస్తారా?
జగన్ ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లి పులివెందుల శాసనసభా నియోజకవర్గం అభ్యర్థి ఎంపికపై జగన్ అధిష్టానంతో చర్చించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే, జగన్ ను శాసనసభకు పంపడానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ మాత్రం ఇష్టంగా లేదు. ఇదే జగన్ పాలిట శాపంగా మారుతోంది. జగన్ పార్టీ అధిష్టానం నిర్ణయానికి తలొగ్గడమో, ధిక్కరించడమో తప్ప మరో మార్గం లేదు. అయితే, ఈ విషయంలో జగన్ కచ్చితంగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఆయన వ్యవహార శైలియే ఆ విషయాన్ని పట్టిస్తోంది. జగన్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించే సాహసం చేస్తారా అనేది అనుమానంగానే ఉంది. అయితే, ఆయన లాబీ మాత్రం ధిక్కారానికి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఈ స్థితిలో పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ను పులివెందుల సీటుకు అభ్యర్థిగా ఎంపిక చేయాలని వారు ఇప్పటికే పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. జగన్ మామ, కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి బహిరంగ ప్రకటన చేశారు. వైయస్ జగన్ ను పులివెందుల సీటుకు అభ్యర్థిగా నిలిపితేనే వైయస్ రాజశేఖర రెడ్డి లక్ష్యాలు నెరవేరుతాయని ఆయన అన్నారు. అయితే తామంతా పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. ఏమైనా, జగన్ పరిస్థితి అయోమయంగానే ఉంది.