రాహుల్ షాడో పిఎం?

రాహుల్ మంత్ర జపంపై ప్రతిపక్షాలు చిరాగ్గా ఉన్నాయి. సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అమర్ సింగ్ వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చేశారు. అంతా రాహుల్ వల్లనే సాధ్యమైతే ఆయననే ప్రధాని చేయవచ్చు కదా అని అమర్ సింగ్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఇమేజ్ పెంచేందుకు కావాలని ఇటువంటి ప్రచారం జరుగుతోందనేది ప్రతిపక్షాల అభిప్రాయం. భవిష్యత్తు ప్రధానిగా నిలబెట్టడానికి ఇదంతా జరుగుతోందని అంటున్నారు. నిజానికి, ప్రధాని పీఠంపై కూర్చోవాలని అనుకుంటే రాహుల్ గాంధీకి క్షణం కూడా పట్టకపోవచ్చు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ, రాహుల్ గాంధీ అందుకు సిద్ధంగా లేరు. తక్షణ అధికారం చేపట్టడానికి బదులు దాన్ని కొన్నేళ్ల పాటు ఖాయం చేసుకోవడం ఆయనకు కావాలి. కాంగ్రెసు పార్టీని ఏళ్ల తరబడిగా అధికారంలో కొనసాగేలా పటిష్ట పరిచాలనేది ఆయన ఉద్దేశం. రైతు పక్షపాతిగా, పేదల పక్షపాతిగా, యువ నేతగా, విద్యార్థి అనుకూలుడిగా - ఇంకా అనేక గుణాలు గల నాయకుడిగా రాహుల్ నిలబడదలుచుకున్నారు. తనను మించిన దేశ నాయకుడు లేడని అనిపించుకోవడం అవసరం. అంత వరకు ఆయన ప్రధాని పదవి కోసం వేచి చూడడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెసు అధికారంలో ఉన్నంత వరకు అధికారం తనను, తన తల్లి సోనియా గాంధీని, తన కుటుంబాన్ని వదిలి వెళ్లదనేది ఆయనకు తెలుసు. ప్రధాని ఎవరనేది, దేశంలోని కాంగ్రెసు పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరనేది నిర్ణయించేది ఆ కుటుంబమే. ఈ రకంగా అధికారమంతా ఇప్పుడు రాహుల్ గాంధీదే.
రాహుల్ కాదని కాంగ్రెసులో ఏమీ పూచిక పుల్ల కూడా కదలనేది అందరికీ తెలుసు. ఈ స్థితిలో ఇమేజ్ ను పెంచుకుని ప్రధాని పీఠంపై కూర్చోవాలనేది రాహుల్ అభిమతం కావచ్చు. కానీ తనను భావి ప్రధానిగా చూడవద్దని, తనకు ప్రధాని పదవిపై ఆశ లేదని ఆయన పదే పదే అంటున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, తదితర రాష్ట్రాల్లో తిరిగి కాంగ్రెసుకు ప్రాణం పోయాలని ఆయన పనిచేస్తున్నారు. అందులో ఆయన సఫలీకృతమవుతున్నారు కూడా. అది ఒక రోజులో జరిగేది కాదని కూడా తెలుసు, అందుకే ఆయన నిరీక్షించడానికి సిద్ధపడ్డారు. దేశ నాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్న తర్వాత ఆయన ప్రధాని పదవి చేపడతారనేది నిస్సహందేహం. అది 2014లో జరిగే అవకాశాలున్నాయనేది ఇప్పుడు అందరూ అనుకుంటున్న మాట.












Click it and Unblock the Notifications