రోశయ్యకు రహదారి?
సోమవారం ఏర్పాటు చేసిన మంత్రుల సమావేశం కూడా అందులో భాగమేనని అంటున్నారు. మంత్రులు ప్రాంతాలకు అతీతంగా వ్యవహరించాలని ఆయన మంత్రులకు సూచించారు. ఇబ్బంది కలగకుండా సమన్వయంతో వ్యవహరించాలని కూడా ఆయన సూచించారు. శాసనసభ్యులను గ్రూపులుగా విభజించి అంశాలవారీగా వారిని వివిధ విషయాల్లో అధ్యయనం చేసేలా చూడాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఆ రకంగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి తన పని సజావుగా సాగేలా చూసుకోవాలని ఆయన అనుకుంటున్నారు.
ఇదే సమయంలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం రోశయ్యకు సహకరించేలా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకున్నట్లే కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెసు అధిష్టానం పిసిసి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. పిసిసికి, ప్రభుత్వానికి మధ్య సమన్వయానికి ఇది పని చేస్తుంది. ఈ కమిటీలో వైయస్ జగన్ కు, ఆయన మంత్రవేత్త కెవిపి రామచందర్ రావుకు స్థానం కల్పించింది. దానివల్ల వైయస్ జగన్ వర్గం అనివార్యంగా రోశయ్యకు సహకరిస్తుందనేది కాంగ్రెసు అధిష్టానం భావన. బాధ్యతలు అప్పగించిన తర్వాత జగన్ తన వర్గాన్ని రోశయ్యకు వ్యతిరేకంగా పని చేయించలేరనేది అధిష్టానం ఆలోచన. కాగా, తెలంగాణపై కూడా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను, నివేదికకు కాలపరిమితిని నిర్దేశించడం ద్వారా ప్రాంతాలవారిగా పార్టీ శాసనసభ్యులు విడిపోకుండా చూడాలనే ఆలోచన కూడా చేస్తోంది. ఈ కమిటీ విధివిధానాలు, కాలపరిమితి ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా చూసి రోశయ్య ప్రభుత్వ పనికి ఆటంకం కలగకుండా చూడాలనేది కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆలోచనగా చెప్పవచ్చు. ఏమైనా, రోశయ్య చిట్కాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సిందే.