సోనియా గైడ్ చేస్తారా?
నివేదికల సమర్పణకు విధించిన గడువును పెంచాలని కోరుతామని మొయిలీ చెప్పారు. అయితే గడువు పెంచే అవకాశాలు లేవని శ్రీకృష్ణ గురువారం స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెసు నివేదిక సమర్పించే విషయంలో దాటవేసే ధోరణి అవలంబిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. సీమాంధ్ర నేతల వ్యతిరేకత నుంచి బయటపడడానికి కాంగ్రెసు ఈ దాటవేతకు ఉపక్రమించవచ్చుననే మాట వినిపిస్తోంది. అయితే, శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పించకపోతే కాంగ్రెసు విశ్వసనీయత మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటన తెలంగాణకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వం కాంగ్రెసు నేతృత్వంలోనే నడుస్తుంది కాబట్టి దాన్ని కాంగ్రెసు నిర్ణయంగా భావించడానికి వీలుంది. ఇప్పుడు తెలంగాణపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే మాట వినిపిస్తోంది. ఈ స్థితిలో కాంగ్రెసు నివేదిక సమర్పించకపోతే తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురు కావడమే కాకుండా ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పించే విషయంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ డి. శ్రీనివాస్ ను గైడ్ చేస్తారనే మాట కూడా వినిపిస్తోంది. అందుకే శ్రీనివాస్ ఢిల్లీలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నెల 10వ తేదీలోగా డి. శ్రీనివాస్ నివేదిక సమర్పించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇది సోనియా చేతిలోనే ఉంది. అయితే కాంగ్రెసు నివేదిక సమర్పించే వరకు నమ్మలేని పరిస్థితి.