జగన్ భయంతోనే...
నిజానికి, మంత్రి వర్గ విస్తరణకు కసరత్తు పూర్తయింది. కానీ అనుకోకుండా బ్రేక్ పడింది. రోశయ్య మంత్రి విస్తరణకు బ్రేక్ పడడానికి ప్రధాన కారణం కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగనే కారణమని భావిస్తున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి జగన్ ఓదార్పు యాత్రకు పార్టీ అధిష్టానం నుంచి అనుమతి సాధించారు. మంత్రివర్గ విస్తరణ ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఆయన పకడ్బందీగా తన వ్యూహాన్ని అమలులో పెట్టారు. ముఖ్యమంత్రి రోశయ్యతోనూ, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తోనూ చేతులు కలుపుతున్నట్లుగానే వ్యవహరించి తన ఎజెండాను తెర మీదికి తెచ్చారు.
కాంగ్రెసు అధిష్టానం ఎత్తుగడలతో ముఖ్యమంత్రి పదవిపై ప్రస్తుతానికి ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. రోశయ్య బలపడుతూ వచ్చారు. కానీ రోశయ్య బలపడడానికి గానీ, ఆయన తన సొంత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించడానికి గానీ జగన్ వర్గం సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. మంత్రివర్గంలోని చాలా మంది సభ్యులు రోశయ్యకు సహకరిస్తూనే జగన్ అవకాశాలను మెరుగు పరిచేందుకు, రోశయ్య బలపడేందుకు తగిన అవకాశాలు కల్పించకుండా చూసేందుకు పనిచేస్తోందని అంటున్నారు.
జగన్ ఓదార్పు యాత్ర రోశయ్యకు ఒక హెచ్చరిక లాంటిదని అంటున్నారు. మంత్రులు రోశయ్యకు సహకరిస్తున్నా అది తాను సానుకూలంగా ఉండడం వల్లనే అని జగన్ తన యాత్ర ద్వారా చెప్పదలుచుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు. జగన్ వర్గాన్ని మంత్రి పదవుల నుంచి తొలగిస్తే ఎదురయ్యే ఇబ్బందులను కాంగ్రెసు అధిష్టానం పసి గట్టినట్లు చెబుతున్నారు. అదే జరిగితే మరో సారి రోశయ్యకు కష్టాలు తెచ్చి పెట్టడానికి, రాజకీయ సంక్షోభం సృష్టించడాని జగన్ వర్గం సిద్ధంగా ఉన్నట్లు అధిష్టానానికి ఉప్పందింది. దీంతో రోశయ్య మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు సోనియా గాంధీ బ్రేక్ వేసినట్లు చెబుతున్నారు.