కిరణ్ మంత్రివర్గం మూడు ముక్కలు!

ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, వట్టి వసంత్ కుమార్, ధర్మాన ప్రసాద రావు, జానారెడ్డిలు మొదట్లో సిఎంతో బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత దూరం పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. వట్టి వసంత్ కుమార్ తనకు వచ్చిన శాఖపై మొదట్లో అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత సిఎంతో సఖ్యంగానే ఉన్నారు. కానీ ఇటీవల వారి మధ్య మళ్లీ బెడిసి కొట్టినట్లుగా కనిపిస్తోంది. ఇక ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి 108 విషయంలో, చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావు తనను పట్టించుకోవడం లేదని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారని, ముఖేష్ గౌడ్ తన ఫైళ్లు తనకు తెలియకుండానే క్లియర్ కావడంపై, విశ్వరూప్ మరో కారణంతో ఇలా వీరంతా ముఖ్యమంత్రికి పూర్తిగా దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం.
ఇక కిరణ్కు దగ్గరగా కాకుండా దూరంగా కాకుండా ఆయన తీరుపట్ల కినుక వహించిన మంత్రుల జాబితా పెద్దగానే కనిపిస్తోంది. డికె అరుణ, అహ్మదుల్లా, సుదర్శన్ రెడ్డి, బాలరాజు, బస్వరాజు సారయ్య, దానం నాగేందర్, మాణిక్య వరప్రసాద్, గీతారెడ్డి, పితాని సత్యనారాయణ, గల్లా అరుణ కుమారి, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రా రెడ్డి, రాంరెడ్డి వెంకట్ రెడ్డి, శైలజానాథ్ అంటీముట్టనట్లుగానే ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి విషయంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య నేరుగా ముఖ్యమంత్రిని ఏమీ అనక పోయనప్పటికీ అధికారులను టార్గెట్ చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సైతం ముఖ్యమంత్రి తీరుపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఏర్పాటు చేసిన టిటిడి బోర్డు కార్యవర్గాన్ని తనకు తెలియకుండానే నియమించడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
తనకు వచ్చి శాఖపై మొదటి నుండి అసంతృప్తిగా ఉన్న బొత్స సత్యనారాయణకు తాజాగా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా పదవి రావడంతో రాష్ట్ర కాంగ్రెసులో రెండు పవర్ సెంటర్లు మారినట్లుగా కనిపిస్తున్నాయి. బొత్స పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక పార్టీ బలోపేతం పేరిట చాలా హడావుడి చేస్తున్నారు. జిల్లాలు పర్యటిస్తున్నారు. తన తదుపరి లక్ష్యం ముఖ్యమంత్రి పదవే అని బాహాటంగా ప్రకటించి 2014 ఎన్నికల్లో గెలిచి ఆ పదవి చేపట్టాలనే లక్ష్యంగా బాగానే పర్యటిస్తున్నారు. అంతేకాదు పార్టీ నేతలతో సమావేశాలు కూడా జరుపుతూ పార్టీలో తన బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రోశయ్య హయాంలో మంత్రివర్గంపై సిఎంకు పట్టు లేదనే ఆరోపణలు వచ్చినప్పటికీ ఇప్పటి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి అంతకంటే దారుణంగా ఉన్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications