నాగంపై బుసకొట్టిన చంద్రబాబు
టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ హోదాలో నాగం జనార్ధన్ రెడ్డి పూర్తిగా పార్టీ కార్యకలాపాలు పక్కన పెట్టినట్టుగా పలువురు తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు భావించి టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారని సమాచారం. తెలంగాణ విషయంలో నాగం దూకుడుగా వ్యవహరిస్తున్నారని, దూకుడుగా వ్యవహరించడం వల్ల లేనిపోని చిక్కులు వస్తున్నాయని, టిడిపిలో తెలంగాణకోసం ఆయన ఒకక్రే పోరాడుతున్నట్టుగా తెలంగాణ ప్రజలకు కనిపించే విధంగా నాగం ప్రయత్నిస్తున్నారనిమిగిలిన టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేల ఆరోపణలుగా వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లి తెలంగాణ ఫోరం స్థానంలో తెలంగాణ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రతిపాదిస్తే దానికి అధినేత సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది.
సమన్వయ కమిటీ ద్వారా నాగం జనార్ధన్ రెడ్డి దూకుడు తగ్గించాలని తెలంగాణ ప్రాంత నేతలతో పాటు చంద్రబాబు యోచిస్తున్నారు. దూకుడుగా వ్యవహరిస్తూ టిడిపికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్న నాగం టిఆర్ఎస్ టిడిపిపై చేస్తున్న ఆరోపణలు మాత్రం సమర్థవంతంగా తిప్పికొట్టడం లేదనే ఉద్దేశ్యంతో కూడా నాగంను వ్యతిరేకిస్తున్న తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తోంది. నాగంకు చెక్ చెప్పడానికే సమన్వయ కమిటీ ఏర్పాటుకు చంద్రబాబు మొగ్గి చూపినట్టుగా తెలుస్తోంది. మరో విషయమేమంటే తెలంగాణ ఫోరం కన్వీనర్గా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డికే సమన్వయ కమిటీ ఏర్పాటు విషయం తెలియదనే వార్తలు కూడా వస్తున్నాయి. నాగంకు తెలియకుండా, ఆయనతో మాట్లాడకుండానే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని, మరో నాలుగైదు రోజుల్లో ఇందులో సభ్యులను ఎన్నుకునే అవకాశమున్నది.
అంతకుముందు మీడాయాలో తెలంగాణ కోసం హడావుడి చేసిన నాగం జనార్ధన్ రెడ్డి దూకుడును తెలంగాణ ఎమ్మెల్యేలు తగ్గిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాక నాగం జనార్ధన్ రెడ్డి దాదాపు కనిపించకుండా పోయారు. గవర్నర్ ప్రసంగం రోజున టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ధీటుగా రేవంత్ రెడ్డి చేసిన గలాటా తెలంగాణ వ్యాప్తంగా హీరోను చేసిందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత, చలో అసెంబ్లీ సందర్భంగా విద్యార్థులను అరెస్టు చేసిన విషయంపై నాగం హడావుడి చేద్దామనుకున్నా టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలు చేయనివ్వనట్లుగా తెలుస్తోంది. కాగా నాగంకు చెక్ చెప్పడానికి ఏర్పాటు చేయనున్న సమన్వయ కమిటీ కోసం తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. నాగంకు అండగా ఉంటూ వస్తున్న ఎర్రబెల్లి దయాకరరావు ఈ కమిటీపై ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.