చిరంజీవికి ఆది నుంచి మెగా ఆంటకాలే
చిరంజీవికి ఉన్న ఇమేజ్, అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పిఆర్పీ అధికారంలోకి రాక పోయినప్పటికీ సుమారు ఆరవైకి పైగా సీట్లు గెలుచుకొని టిడిపి, కాంగ్రెసులకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని భావించారు. కానీ చిరు తాను సైతం ఓ చోట ఓడిపోయి 18 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లను గెలిచుకోలేనప్పటికీ సుమారు 16 శాతం ఓట్లను సాధించడం ద్వారా చిరుకు ఉన్న ఇమేజ్ను పసిగట్టిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేసే ప్రతిపాదన తీసుకు వచ్చారు. ఈ విషయంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, పిఅర్పీ అధ్యక్షుడు చిరంజీవితో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. అయితే అనుకోకుండా వైయస్ మృతి చెందడంతో ఆ ప్రతిపాదన అప్పటికి వెనక్కి పోయింది. ఆ తర్వాత ఇటీవల ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ వైయస్సార్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ఇలా ఉంటే విలీనం తర్వాత పిఆర్పీలో పూర్తిగా నిస్తేజం చోటు చేసుకుంది.
కాంగ్రెసు పార్టీలో విలీనం అయితే చిరంజీవికి మంచి పదవి వస్తుందని పార్టీలో మరికొందరికి మంత్రి పదవులు వస్తాయని ఆరు నెలలుగా వినిపిస్తున్నప్పటికీ రాష్ట్రంలోని పరిస్థితులు వారికి పదవుల ఆలస్యానికి కారణం అవుతున్నాయి. వైయస్ మృతి తర్వాత అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యతో చిరంజీవికి మంచి సంబంధాలు ఉండేవి. రోశయ్య సైతం చిరును కలుపుకొని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి అధిష్టానంతో మాట్లాడినట్టు తెలుస్తోంది. చిరంజీవి మళ్లీ ఆశలు పెట్టుకుంటున్న సమయంలో రోశయ్య రాజీనామా చేసి చిరంజీవిని, పిఆర్పీని మరోసారి నిరుత్సాహంలో ముంచారు. ఆ తర్వాత కిరణ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ పదవులు, విలీనం కొలిక్కి వస్తున్న దశలో తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి మంత్రి వర్గ విస్తరణకు అడ్డుపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవేళ పరిస్థిది సద్దుమణిగినప్పటికీ తెలంగాణ అంశం, జగన్ అంశంతో తేల్చుకోవడానికే అధిష్టానానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. ఇవన్నీ పూర్తయ్యే వరకు మళ్లీ 2014 ఎన్నికలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఏదో పదవి వస్తుందని ఆశిస్తున్న పిఆర్పీకి నిత్యం ఏదో అడ్డంకి రావడంతో ఆ పార్టీలో పూర్తి స్తబ్దత నెలకొన్నట్టుగా కనిపిస్తోంది.