కాంగ్రెసు ప్లాన్, తెలంగాణకు హైదరాబాద్ మెలిక
సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్, మల్కాజిగి పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ రాజీనామా చేయకపోవడాన్ని, మజ్లీస్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఆ పార్టీ శానససభ్యులు ఎవరు కూడా తెలంగాణకు అనుకూలంగా ముందుకు రాకపోవడాన్ని, హైదరాబాదుకు చెందిన మెజారిటీ శాసనసభ్యులు రాజీనామాలు చేయకపోవడాన్ని ఎత్తి చూపే వ్యూహాన్ని అనుసరించాలని అనుకుంటోంది. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, కాంగ్రెసు శాసనసభ్యులు శశిధర్ రెడ్డి, మణెమ్మ, ఆకుల రాజేందర్ రాజీనామాలు చేయలేదు. కూకట్పల్లి శానససభ్యుడు జయప్రకాష్ నారాయణ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రాజీనామాల వ్యవహారాన్ని తన వ్యూహానికి అనుగుణంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.
హైదరాబాద్కు చెందిన ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని సమీకరించి హైదరాబాద్ మెలిక పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యను పరిష్కరించే అంశాన్ని వెనక్కి నెట్టాలని ప్రయత్నాలు సాగిస్తోంది. తమ తమ నియోజకవర్గాల ప్రజల నుంచి వారిపై ఒత్తిడి లేకపోవడం వల్ల రాజీనామాలు చేయడానికి వారు ముందుకు రావడం లేదు. ఇదే కాంగ్రెసుకు ఇప్పుడు రక్షణ కవచంగా మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ మాత్రం రాజీనామా చేశారు. అయితే, ఆమె రాజీనామా వెనక తెలంగాణ అంశం కన్నా వైయస్ జగన్ అంశమే ఎక్కువ పనిచేసిందనే వాదనను ముందుకు తెచ్చే అవకాశాలున్నాయి.