చిరంజీవికి సోనియమ్మ దీవెనలు!
అయితే చిరంజీవి అభిమానులకు శనివారం సాయంత్రం హామీ ఇచ్చి, ఆదివారం వరకే మాట మార్చారు. తాను సిఎం పదవి కోసం అనలేదని, కేవలం సినిమాల వరకు మాత్రమే అలా మాట్లాడనని విలేకరులతో చెప్పుకొచ్చారు. ఆడియో ఫంక్షన్లో అభిమానులకు తెలివిగా సమాధానమిచ్చిన చిరంజీవి ఆ మాటలను ఏదో అవేశంలో అన్నాడని అనుకోలేము. అంతేకాదు తర్వాత తాను సినిమా గురించి అన్నాను కానీ సిఎం పదవి గురించి అనలేదని మాట మార్చారు. ఆయన మాట మార్చిన విషయం ఎలా ఉన్నప్పటికీ ఆయన ఎందుకు అలా అన్నారని విషయంపై మాత్రం ఇప్పుడు అందరూ దృష్టి సారించారు.
ఇటీవలె తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని అధికారికంగా ప్రకటించిన చిరంజీవికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ నుండి ఏమైనా హామీ వచ్చిందా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. సోనియా హామీ ఉండటం వల్లే చిరంజీవి అలా మాట్లాడి ఉంటారని పలువురు యోచిస్తున్నారు. అయితే చిరంజీవి వ్యాఖ్యలతో ప్రతిపక్షాల మాట ఏమిటో కాని ఆయన జాయిన్ అయిన కాంగ్రెసులో మాత్రం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుందని సమాచారం. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఆరు నెలల దాటింది అంతే. ఆయన బాధ్యతలు చేపట్టిన సమయంలోనే ఆరునెలలే ఉంటాడనే వాదనలు కూడా వినిపించాయి. అయితే చిరంజీవిని తమ దరి చేర్చుకోవడం ద్వారా ఉప ఎన్నికల తర్వాత కొద్ది కాలం ఆగి కిరణ్ను పదవి నుంచి తొలగించి చిరును గద్దెనెక్కిస్తారా అనే గుసగుసలు అధికార పార్టీలో వినిపిస్తున్నాయంట. అంతేకాదు ఈ మధ్య చిరు జగన్పై తీవ్రంగా విమర్శలు చేయడం కూడా గమనార్హం. చిరు వ్యాఖ్యలు సిఎం కిరణ్తో పాటు ఇన్నాళ్లుగా ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న వారిలో నిరుత్సాహాన్ని నింపేవే.
అయితే 2014లో చిరును ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశ్యంతో పార్టీలో విలీనం చేసుకున్నట్టు కూడా వాదనలు వినిపించాయి. అయితే 2014 వరకు పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో మరి కొద్దిరోజుల్లో చిరుకు సిఎం పట్టం కట్టే అవకాశాలు కూడా లేక పోలేదంటున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెసు నేతలు చిరును ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలలో పడ్డారంట. కిరణ్తో పాటు ఇన్నాళ్లూ సిఎం రేసులో ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ వంటి వారికి కూడా ఇది షాకింగ్ వార్తే. ఇప్పటికిప్పుడు అదే నిజమైతే చిరంజీవి సామాజిక వర్గానికే చెందిన బొత్స సత్యనారాయణ, వట్టి వసంత్ కుమార్లు కాంగ్రెసు దూరం అయ్యే అవకాశాలు కూడా లేక పోలేదని పలువురు భావిస్తున్నారు.
అసలు చిరు చేరికే వారికి ఇష్టం లేదట. ఎందుకంటే వారి సామాజిక వర్గానికే చెంది చిరు కాంగ్రెసులో కలిస్తే వారు ఆయన తర్వాతి స్థానంలో నిలబడవలసి ఉంటుంది. చిరు రాకుంటే బొత్స 2014లోనైనా ముఖ్యమంత్రిగానీ, ఉప ముఖ్యమంత్రిగానీ అయ్యే అవకాశాలు ఉండేవి. చిరు రాక వారిని దెబ్బతీసింది. అయితే అసంతృప్త వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకొని అధిష్టానం నిర్ణయించుకుంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.