కిరణ్ కుమార్ రెడ్డి పక్కలో మరో బల్లెం
డి. శ్రీనివాస్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి ముందరి కాళ్లకు అధిష్టానం బంధం వేసిందని భావిస్తున్నారు. డి. శ్రీనివాస్ ఎంపికతో తన జట్టును ఎంపిక చేసుకుందామని అనుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మంత్రి వర్గ విస్తరణ చేపట్టి తనకు ఇష్టమైనవారితో పాలన సాగించాలని అనుకున్నారు. ఆయన మంత్రి వర్గ విస్తరణకు తెలంగాణ సకల జనుల సమ్మె అడ్డు వచ్చింది. ఈలోగా పరిస్థితులు మారి డి. శ్రీనివాస్ మళ్లీ తెర మీదికి వచ్చారు. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ చేపడితే డి. శ్రీనివాస్ను అనివార్యంగా మంత్రివర్గంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. దానివల్ల తనకు వచ్చే ఇబ్బందులేమిటో కిరణ్ కుమార్ రెడ్డికి తెలుసు.
ఓ వైపు చిరంజీవితో కలిసి బొత్స సత్యనారాయణ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు వారికి డిఎస్ తోడయ్యేట్లున్నారు. ఈ ముగ్గురితో వేగడం కిరణ్ కుమార్ రెడ్డికి అంత సులభం కాకపోవచ్చు. ఏ పని చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ ముగ్గురికీ చెప్పాల్సి ఉంటుంది. వారు సరేనంటే తప్ప ముందుకు సాగే పరిస్థితి ఉండదు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి అధికారం నామమాత్రం కానుంది. ఇప్పటికే చిరంజీవి, బొత్సల రూపాల్లో రెండు అధికార కేంద్రాలు తయారు కాగా, డిఎస్తో మరో అధికార కేంద్రం తయారవుతోంది.
నవంబర్లో తెలంగాణ నిర్ణయం తీసుకుంటే డిఎస్ ద్వారా ముఖ్యమంత్రి మార్పును కాంగ్రెసు అధిష్టానం ముందుకు తేవచ్చునని కూడా అంటున్నారు. పరిస్థితులను చక్కదిద్దడానికి తెలంగాణకు చెందిన డిఎస్ను అధిష్టానం ముఖ్యమంత్రి పదవికి పోటీ పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డికి అధికారం నల్లేరు మీద నడక కాదని తేలిపోయింది.