పుట్టడమే తరువాయి గిట్టడమే..
గతంలో నందమూరి హరికృష్ణ, తన బావ దగ్గుబాటి హరికృష్ణతో కలిసి అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. దాని మనుగడ కూడా ఎంతో కాలం సాధ్యం కాలేదు. స్వర్గీయ ఎన్టీ రామరావు నుంచి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై అలిగి వారు ఆ పార్టీని స్థాపించారు. అధికార మార్పిడి తర్వాత వారికి ఇస్తానని చెప్పిన పదవులను చంద్రబాబు ఇవ్వలేదు. తమను చంద్రబాబు వాడుకుని వదిలేశాడని ఆరోపిస్తూ చంద్రబాబును ఎదుర్కోవడానికి వారు ఆ పార్టీని స్థాపించారు. అయితే, ఆ పార్టీని వారు నిలబెట్టలేకపోయారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సొంతం కావడంతో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్ పేరును వాడుకునే రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం సాధించడానికి లక్ష్మీపార్వతి తీవ్రంగానే ప్రయత్నించారు. అయితే, ఎన్నికల్లో అది ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు ఆ పార్టీ ఉందా, లేదా అనుమానం కలిగే పరిస్థితి.
తెలంగాణ అంశంపై చంద్రబాబుతో విభేదించి టి. దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి నవ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ మనుగడ మరీ కష్టంగా మారింది. దాంతో దేవేందర్ గౌడ్ తన పార్టీని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు. ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 30 ఏళ్లుగా మనుగడ సాగిస్తోంది. ఈ ముప్పై ఏళ్ల కాలంలో సంక్షోభాలను, ఒడిదొడుకులను చవి చూసింది. కాంగ్రెసు వ్యతిరేక ముద్ర బలంగా వేసుకున్న తెలుగుదేశం పార్టీ అదే ప్రాణంగా నిలబడుతోంది. కాంగ్రెసు వ్యతిరేకత ముద్ర లేకపోతే అది మనుగడ సాగించడం కష్టమే. అందుకే, చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు పదే పదే విమర్శలు చేస్తున్నారు.
ఇక, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విషయానికి వస్తే, దానికి ప్రాణవాయువు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన లక్ష్యం. రాష్ట్ర ఏర్పాటు డిమాండుతో ఉద్యమం సాగినంత కాలం దాని ప్రత్యేకత ఉంటుంది, దాని మనుగడ సాధ్యమవుతుంది. మిగతా పార్టీలతో భిన్నత్వాన్ని కోల్పోతే దాని మనుగడ సాధ్యం కాదు. తాజాగా పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారు. ఈ పార్టీ హవా కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. అయితే, కాంగ్రెసు పార్టీనో, తెలుగుదేశం పార్టీనో మట్టి కరిపించగలిగితే మాత్రమే అది మనుగడ సాగించగలుగుతుంది. మొదటి స్థానం కోసం కాకపోయినా రెండో స్థానం కోసమైనా అది పోటీ పడాల్సి ఉంటుంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వల్ల మూడో స్థానానికి వెళ్లిపోయే పార్టీ మనుగడ కష్టంగా మారుతుంది. అది కాంగ్రెసా, తెలుగుదేశం పార్టీయా అనేది చెప్పలేం. అసలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 2014 వరకు తన ఊపును కొనసాగించి, అధికారాన్ని దక్కించుకుంటుందా అనే విషయాన్ని కూడా ఇప్పుడే చెప్పలేం. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల్లో దేన్నో ఒక్కదాన్ని మట్టి కరిపించలేకపోతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుంది.