సిఎం కిరణ్కు దూరంగా తెలంగాణ మంత్రులు
తన శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాల విషయంలోనూ శంకర్ రావు ముఖ్యమంత్రిని కలవడం లేదని సమాచారం. అంతేకాదు సిఎం ఏర్పాటు చేసే మంత్రివర్గ సమావేశాలకు సైతం ఆయన గైర్హాజరవుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం సిఎం తీరుపట్ల అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు కోమటిరెడ్డి సోదరులు వెళతారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా కోమటిరెడ్డి అవుట్ అవుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన మంత్రివర్గంలో తన చోటు కాపాడుకోవడానికే మొదటి నుండి తెలంగాణపై గళమెత్తుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశాలకు ఆయన వెళ్లిన దాఖలాలు లేవు. అంతేకాదు మంత్రివర్గంలో ఉండటమే సిగ్గుచేటు అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. ఐటి శాఖ కేటాయించినప్పటి నుండి ముభావంగా ఉన్న మంత్రి పొన్నాల లక్ష్మయ్య సైతం ఇటీవల ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల విషయంలో ఆయన ప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్రంగానే మండిపడ్డారు. నేరుగా సిఎంను ఏమీ అననప్పటికీ అధికారుల తీరుపై మండిపడటం ద్వారా ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేసుకున్నట్టుగానే కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవిపై భారీ ఆశలు పెట్టుకున్న మంత్రి గీతారెడ్డి సైతం సిఎం కిరణ్ పట్ల గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కొసమెరుపు ఏమంటే తెలంగాణ మంత్రులు ఇంతగా అసంతృప్తితో విమర్శలకు దిగుతున్నప్పటికీ వారి వ్యతిరేకతను ముఖ్యమంత్రి అంత సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడం లేదు.