సిఎం, డిఎస్ మధ్య యుద్ధం?
ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపికలో డిఎస్ పాత్ర నామమాత్రమేనని కొందరు అంటున్నారు. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సిఎంలో ఇదే ధోరణి కన్పించిందని అంటున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన సుధాకరబాబు అభ్యర్థిత్వాన్ని ఇందుకు తార్కాణంగా చెబుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుధాకర్ బాబును ఢిల్లీలో అధిష్ఠానం ప్రకటించింది. సుధాకర్ బాబు ఎవరో డిఎస్కు ఖచ్చితంగా తెలియదంటా. కొం దరు పాత్రికేయులు సుధాకరబాబు గురించి డిఎస్ వద్ద వాకబు చేస్తే యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు టిజెఆర్ సుధాకర్ బాబుగా డిఎస్ వివరించే ప్రయత్నం చేశారంట. అయితే సిఎం కిరణ్ జోక్యం చేసుకుని కర్నూలు జిల్లాకు చెందిన సుధాకర్ బాబుగా సరిదిద్దారని గుర్తు చేశారంట.
ఉభయగోదావరి జిల్లాల్లో అభ్యర్థుల విషయంలోనూ కిరణ్, డీఎస్ల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని సమాచారం. కాగా కడప తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీతో చేసుకున్న లోపాయికారీ ఒప్పందాలు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయని డిఎస్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. గవర్నర్ కోటా కింద ఎంపిక చేసే ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయాన్ని డిఎస్ పూర్తిగా ముఖ్యమంత్రికే అప్పగించారు. కాగా రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉండాలంటే ఎమ్మెల్సీ కావాలన్న కోరిక డిఎస్ మదిలో ఉన్నట్టుగా గ్రహించి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి చెందినవారికి ఎమ్మెల్సీగా అవకాశం లేదంటూ ముఖ్యమంత్రి వర్గం ప్రచారం చేసిందనే వాదన కూడా ఉంది.
కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ డిఎస్, కిరణ్ల మధ్య ఇదే పరిస్థితి నెలకొందని పార్టీ వర్గాలు పేర్కొన్నా యి. ఈ విషయంలో డిఎస్ చొరవ తీసుకొని కడప జిల్లా నేతలతో సమావేశం పెట్టేంత వరకూ అభ్యర్థులెవరన్నది సందేహాస్పదంగానే ఉందని పార్టీ నేతలు చెప్పారు. మంత్రి వైఎస్ వివేకానందరెడ్డితో డిఎస్ ఏకాంతంగా మాట్లాడి పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయాలని ఒప్పించారు. అప్పటి వరకూ వివేకాను కడప లోక్సభకే పోటీ చేయించాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని డిఎస్ వద్ద ముఖ్యమంత్రి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి వివేకా పోటీకి సమ్మతించడంతో కడప లోక్సభకు ఎవరిని పోటీకి దింపాలన్న ఆలోచన వచ్చినప్పుడు సైతం డిఎస్, కిరణ్ మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్టుగా తెలుస్తోంది.
మొదటినుండి కాంగ్రెసులో ఉన్న వారికి ఇవ్వాలని డిఎస్ పట్టుబట్టగా, టిడిపి నుండి కాంగ్రెసులోకి వచ్చిన కందుల రాజమోహన్ రెడ్డి సోదరులకు కడపనుండి అవకాశం కల్పించాలని సిఎం కిరణ్ భావించినట్లుగా తెలుస్తోంది. కందుల సోదరులను పోటీ చేయించాలని సిఎం పట్టుబట్టడంపై డిఎస్ అసంతృప్తి చెందారని తెలుస్తోంది. కందుల సోదరులు కాంగ్రెస్లో చేరుతారన్న సమయానికి చేరకుండా ఆ మరసటి రోజున చాలా సేపు బతిమలాడిన తర్వాత పార్టీ తీర్థం పుచ్చుకోడానికి సమ్మతించడం వంటి అంశాల పట్ల డిఎస్ అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు. నిజానికి డిఎస్ తొలి నుంచీ పార్టీకి చెందిన డి.ఎల్.రవీంద్రారెడ్డి లేదా వరదరాజుల రెడ్డిని కడప బరి లో దింపుదామని చెబుతూ వచ్చారు. చివరికి కందుల సోదరులు పోటీకి విముఖత చూపడంతో సిఎం సమక్షంలో కడప నేతలంతా డిఎల్ పేరును ఏకగ్రీంగా ఆమోదించారు. తాను మొదటి నుంచి డిఎల్ పేరునే ప్రతిపాదిస్తూ వచ్చానని చివరికి ఇతరులను బతిమాలి, భంగపడాల్సి వచ్చిందని డిఎస్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గంలో చేరి పార్టీకి ద్రోహం చేస్తున్నవారిపై వేటు వేసే విషయంలోనూ ముఖ్యమంత్రి, డిఎస్ ల మధ్య అభిప్రాయభేదాలు స్పష్టంగా కన్పిస్తున్నాయని తెలుస్తోంది. పిసిసి పరిధిలోని వారిపై వేటు వేస్తుంటే సిఎల్పీ పరిధిలో అనర్హత వేటు వేయాల్సిన ఎమ్మెల్యేల విషయంలో ఉదాసీనంగా సిఎం వ్యవహరిస్తుండటం డిఎస్తో పాటు పలువురు కాంగ్రెసు నాయకులలోనూ అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తోంది. డిఎస్ ఇటీవల గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే సిఎంకు చెప్పానని స్పష్టం చేశారు. పైగా క్రమశిక్షణ అనేది ప్రభుత్వ పరిధిలోనిది కాదని పార్టీకి సంబంధించినదని అంటూ బంతిని డిఎస్ కోర్టులోకి కిరణ్ నెడుతున్నారని నేతలు అంటున్నారు. కాంగ్రెస్ను రెండుసార్లు సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడంలో డిఎస్, దివంగత వైయస్ల సమష్ఠితత్వమే కారణమని పార్టీ నేతలు చెబుతున్నారు.