జగన్ కోసం 70 మంది ఎమ్మెల్యేలు సిద్ధమా?
అయితే జగన్ ఆస్తులపై సిబిఐ దాడులు, దివంగత వైయస్సాఆర్ పేరును ఎఫ్ఐఆర్లో పేర్కొనడం నేపథ్యంలో 24 మంది శాసనసభ్యులు, ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్సీలు ఆదివారం వైయస్సాఆర్సీ పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. కాంగ్రెసు కుట్రలకు విరుగుడుగా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. భేటీలో 24 మంది ఎమ్మెల్యేలే పాల్గొన్నప్పటికీ మరో ఆరుగురు కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కేవలం ఈ 30మందికే కాక మరో ముప్పై మందికి పైగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారని జగన్ వర్గం చెబుతోంది. ఆదివారం ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు సైతం ఈ రోజు ముప్పై మంది రాజీనామా చేసి రేపు మరో ముప్పై మంది రాజీనామాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. త్వరలో రాష్ట్ర రాజకీయాలనే మలుపుతిప్పే నిర్ణయం ఉంటుందని ఆయన అన్నారు. అంబటి రాంబాబు సైతం కాంగ్రెసులో తమ అనుకూలురు చాలామంది ఉన్నారని చెప్పారు.
కాంగ్రెసుతో సహా ఇతర పార్టీలలోని పలువురు నేతలు ఇప్పటి వరకు జగన్కు బహిరంగంగా మద్దతు పలకనప్పటికీ వారు నిత్యం ఆయనకు టచ్లో ఉంటున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వారంతా రాజీనామాలకు కలిసి వస్తారని జగన్ వర్గం గట్టిగా భావిస్తోంది. తద్వారా ప్రభుత్వాన్ని కూల్చవచ్చనే ఉద్దేశ్యంతో జగన్ వర్గం ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాకుండా రాజీనామాలు చేసి జగన్పై కాంగ్రెసు కుట్ర పన్నుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి బస్సుయాత్ర చేపట్టనున్నట్లుగా కూడా తెలుస్తోంది. సిబిఐ దాడులు, కడప ఉప ఎన్నికలలో జగన్, విజయమ్మ ఘన విజయం నేపథ్యంలో రాజీనామాలు చేసి సానుభూతితోనైనా గెలవచ్చనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే అన్నాహజారే అవినీతి ఉద్యమానికి యువత నుండి అశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో అది ఫలిస్తుందా లేదా చూడాలి.