ఫిబ్రవరి 8లోగా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు
శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈలోగా వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకుంటారని అంటున్నారు. ఫిబ్రవరి 8వ తేదీలోగా వాటిని తేల్చేయవచ్చునని చెబుతున్నారు. అయితే, తెలంగాణలోని శానససభా నియోజకవర్గాలకు, జగన్ వర్గం శానససభ్యులపై వేటు వేస్తే ఖాళీ అయ్యే స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు జరగకూడదనే ఎత్తుగడతో కాంగ్రెసు వ్యవహరిస్తోందని, అందువల్లనే తమపై వేటు వేయడం లేదని వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు విమర్శిస్తున్నారు. తెలంగాణలోని ఆరు స్థానాలకు, నెల్లూరు జిల్లాలోని కోవ్వూరు శాసనసభా నియోజకవర్గానికి ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు. అది ప్రకటించిన తర్వాత జగన్ వర్గం శాసనసభ్యులపై వేటు పడుతుందని అంటున్నారు.
కాగా, ఉప ఎన్నికలు జరిగే స్థానాలను తగ్గించాలనే ఎత్తుగడతో కాంగ్రెసు పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకేసారి 26 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే మినీ సాధారణ ఎన్నికలను తలపిస్తుందని, ఇందులో వ్యతిరేక ఫలితాలు వస్తే 2014లో వచ్చే సాధారణ ఎన్నికలపై దాని ప్రభావం పడుతుందని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. దీంతో వైయస్ జగన్ వర్గానికి చెందిన కొంత మంది శాసనసభ్యులను తమ వైపు లాక్కోవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.