ఐదు రోజులు 4 గంటలు: ఒక్క ఇష్యూ లేదు
దాదాపు ఏడాదిగా విద్యుత్తు కోతతో పరిశ్రమలు కుదేలవుతున్నాయి. పంటలు సరిగా పండక, విద్యుత్తు లేక ఉన్న వాటికి సరిగా నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సాగుతో పాటు తాగునీటి కష్టాలు ఉన్నాయి. ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ సభలో మాత్రం వాటి పరిష్కారం కోసం కాసేపు కూడా చర్చ జరగలేదు. ఐదు రోజులు సమావేశాలు జరగ్గా మొత్తంగా చూస్తే సభ నాలుగు గంటలకు అటు ఇటుగా మాత్రమే నడిచింది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడు నిమిషాలు మాట్లాడితే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఐదు నిమిషాలు మాట్లాడారు. సభ నడిచిన నాలుగు గంటల్లో గం.1.23నిమిషాలు సంతాప తీర్మానాలకు, వాయిదా తీర్మానాల తిరస్కరణకు 37 నిమిషాలు, అవాంతరాలకు గం.1.13 నిమిషాలు, స్పీకర్ ప్రకటనలకు ఎనిమిది నిమిషాలు పోయింది. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెసు గం.1.06 నిమిషాలు, టిడిపి 39 నిమిషాలు, తెరాస 52, బిజెపి 20, వైయస్సార్ కాంగ్రెసు 18, ఎంఐఎం ఆరు, సిపిఐ 14, సిపిఎం 12, లోక్సత్తా ఆరు, స్వతంత్రులు 17 నిమిషాలు మాట్లాడారు.
సభ జరిగే తీరుపై అధికార, విపక్ష సభ్యులు అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. సభకు రావడం ఐదు పది నిమిషాల్లో వాయిదా పడి బయటకు వెళ్లడం ఈ ఐదు రోజులు పరిపాటిగా సాగింది. కాగా సభకు కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే ఆలస్యంగా రావడం గమనార్హం. సభ నడిపే తీరుపై విప్లకు కిరణ్ కుమార్ రెడ్డి సూచనలు కూడా చేయలేదట. దీంతో ప్రభుత్వం కేవలం మొక్కుబడిగా మాత్రమే సమావేశాలు నిర్వహించాలని చూసిందని విపక్షాలు ఆరోపించాయి.